Begin typing your search above and press return to search.

సీఎం మీద కానిస్టేబుల్ పరువునష్టం దావా?

By:  Tupaki Desk   |   1 Aug 2015 4:58 AM GMT
సీఎం మీద కానిస్టేబుల్ పరువునష్టం దావా?
X
దేశంలో మరెక్కడా లేని రాజకీయం ఢిల్లీలో నడుస్తోంది. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నడుస్తున్న పోరు రోజుకో రూపు మారుతూ.. ఘర్షణ వాతావరణం నెలకొనటం తెలిసిందే. దీనికి తోడు.. సామాన్యుడిగా తనకు తాను చెప్పుకునే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. సామాన్యులైన అధారుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

ఆ మధ్యన పోలీసుల్ని ఉద్దేశించి ‘‘తుల్లా’’ అనే పదాన్ని వాడటం.. అది కాస్తా వివాదాస్పదం కావటం తెలిసిందే. తమను కించపరిచిన ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై పరువునష్టం దావాను వేశారో పోలీస్ కానిస్టేబుల్. ముఖ్యమంత్రి వినియోగించిన పదం కారణంగా.. కుటుంబ సభ్యులు.. బంధుమిత్రులలో చులకన అయ్యామన్నది సదరు కానిస్టేబుల్ అభియోగం.

దక్షిణ ఢిల్లీలోని గోవింద్ పురి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న హర్వీందర్ తాజాగా వ్యాజ్యం దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పరువునష్టం కేసును విచారించేందుకు కోర్టు సైతం అంగీకరించింది. కేజ్రీవాల్ పై వేసిన పరువునష్టం దావా విచారణను సెప్టెంబరు 10వ తేదీన విచారించనున్నారు. ముఖ్యమంత్రిపై కానిస్టేబుల్ వేసిన పరువునష్టం దావా ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.