Begin typing your search above and press return to search.

రూ.11.05వేల కోట్లు దోచేసిన రిలయన్స్..?

By:  Tupaki Desk   |   2 Dec 2015 5:05 AM GMT
రూ.11.05వేల కోట్లు దోచేసిన రిలయన్స్..?
X
నిబంధనలకు విరుద్ధంగా రిలయన్స్ భారీగా అక్రమాలకు పాల్పడిందా? అంటే.. అవునని చెబుతున్నారు. కేజీ బేసిన్ లో రియలన్స్ వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం కేజీ బేసిన్ లో రిలయన్స్ తీరును తప్పు పట్టటం తెలిసిందే. తాజాగా.. రిలయన్స్ మోసాన్ని ఒక నివేదికలో స్పష్టం చేయటంతో పాటు.. అదెంత స్థాయిలో ఉందన్న విషయాన్ని బయటపెట్టారు.

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 11.05వేల కోట్ల రూపాయిలు విలువైన గ్యాస్ ను అక్రమపద్ధతిలో తోడేసినట్లుగా డిగొలియర్ అండ్ మెక్ నాటన్ అనే సంస్థ నిగ్గుతేల్చటం సంచలనంగా మారింది. తాను రూపొందించిన తుది నివేదికను డీజీహెచ్ కు సమర్పించింది. అయితే.. ఈ దోపిడీ ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు. 2009 నుంచి మోసం చేసిన మొత్తం విలువ ఇంత భారీగా ఉంటుందని తేల్చారు.

రిలయన్స్ మోసం ఎలా సాగిందన్న దానికి చెబుతున్నదేమిలంటే.. ఏపీ తీరంలోని కేజీ బేసిన్ లో తన పక్కనే ఉన్న ఓఎన్ జీసీ పరిధిలోని సహజవనరుల బావుల్లో నుంచి తన డీ6 క్షేత్రానికి గ్యాస్ పారించుకున్నట్లుగా తేల్చారు. ఈ వివాదం ఎప్పుడో సుప్రీం చెంతకు చేరింది. దీనిపై విచారణ చేసేందుకు రిలయన్స్.. ఓఎన్ జీసీ సంస్థలు రెండు డీజీహెచ్ నివేదికకు ఓకే చెప్పటం.. సుప్రీం ఆ దిశగా ఆదేశాలు ఇవ్వటంతో.. సదరు వ్యవహారంపై దృష్టి సారించింది. ఓఎన్ జీసీ ఆరోపించినట్లే రిలయన్స్ తప్పుడు పనులకు పాల్పడిందని తేల్చారు. మరి.. దీనిపై ప్రభుత్వం.. కోర్టులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.