Begin typing your search above and press return to search.

వెంక‌య్య ఇంట్లో ఇంకో ప‌ద‌వి ఖ‌రారైన‌ట్లే

By:  Tupaki Desk   |   25 Oct 2016 9:41 AM GMT
వెంక‌య్య ఇంట్లో ఇంకో ప‌ద‌వి ఖ‌రారైన‌ట్లే
X
బీజేపీ సీనియర్ నేత - కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడుకు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ఉన్న ద‌గ్గ‌రి సంబంధం గురించి కొత్తగా చెప్ప‌క్క‌ర్లేదు. జాతీయ నేత‌గా గుర్తింపు పొందాల‌నే క్ర‌మంలో వెంక‌య్య మ‌ద్ద‌తు కీల‌క‌మైన నేప‌థ్యంలో ఆయ‌న్ను సంతోషపెట్టేందుకు సీఎం చంద్ర‌బాబు కొత్త నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని స‌మాచారం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ (నుడా) ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం వెనుక వెంక‌య్య కుటుంబంలో వార‌సుల‌ను తెర‌మీద‌కు తీసుకురావ‌డ‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

నెల్లూరు అర్బ‌న్ డెవ‌ల‌ప్‌ మెంట్ అథారిటీ ఏర్పాటు ఎప్పటి నుంచో పెండింగ్‌ లో ఉంది. ఇంతకాలం నుడా ఏర్పాటుపై ప్రభుత్వం ఎప్పటికప్పడు దాటవేత ధోరణిలో ఉంటూ వచ్చింది. ఇటీవల నుడాను ఏర్పాటు చేసేందుకు అన్ని సన్నాహాలు ప్రారంభిస్తున్నట్లు జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం రావడంతో జిల్లా టీడీపీ నేతల్లో ఆశలు చిగురించాయి. తాజాగా నుడాకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో - ఇక నుడా చైర్మన్ పదవి ఎవరిని వరించనుందనే ప్రశ్న మొదలైంది. ఎప్పట్నుంచో ఈ పదవిపై ఆశ పెట్టుకున్న కొందరు టీడీపీ నేతలు ఎదురుచూస్తుండ‌గా, అనూహ్యంగా వెంక‌య్య‌నాయుడు కుమార్తె దీపా వెంకట్ పేరు తెరపైకి వచ్చింది. జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత బీద మస్తాన్‌ రావు - టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి - నెల్లూరు లోక్‌ సభ నియోజకవర్గ ఇన్‌ చార్జ్ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి - తాళ్లపాక అనూరాధలు ఎప్పట్నుంచో ఈ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వీరితోపాటు ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు ఉన్న డాక్టర్ జెడ్.శివప్రసాద్ పేరు కూడా అప్పుడప్పుడు ఈ పదవి కోసం వినిపిస్తూనే ఉంది. కోటంరెడ్డి కూడా నుడా ప‌ద‌వి ఆశిస్తున్నప్పటికి, ముఖ్యమంత్రి వియ్యంకుడు - సినీనటుడు బాలకృష్ణ అండదండలతో త్వరలో ఈయనకు రాష్టస్థ్రాయి నామినేటెడ్ పదవి వచ్చే అవకాశం ఉందనే ధీమాతో ఆయన అనుచరులు ఉన్నారు. దీంతో ఆయన కూడా నుడా పదవిపై గతంలో ఉన్నంత ఆశతో కనిపించడంలేదు. ఇక ఆదాల ప్రభాకర్‌ రెడ్డికి దాదాపు ఈ పదవి ఖరారయిందనే ప్రచారం గతంలో జోరుగా సాగింది. నుడా ఏర్పాటయితే కచ్చితంగా చైర్మన్ పదవి ఆదాలకేనని ఒక దశలో జిల్లా పార్టీ కూడా భావించింది. అయితే నుడా వాయిదా పడుతూ వస్తుండడంతో అందరు నేతలు చైర్మన్ పదవి గురించి ప్రస్తావించడం మానేశారు. తిరిగి నుడా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించడంతో చైర్మన్ పదవి కోసం పోటీ పెరిగింది.

ఈ దశలో వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ పేరు తెరపైకి వచ్చి తెలుగు తమ్ముళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బీజేపీకి నుడా పదవి ఇవ్వడం ద్వారా వెంకయ్య నుంచి మరింత సహాయం నెల్లూరు జిల్లాకు పొందాలనే చంద్రబాబు ఆలోచనతోనే ఈ పదవికి తటస్థురాలైన దీపా వెంకట్‌ కు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే వెంకయ్యనాయుడు తన కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లో ఎటువంటి పదవి పొందేందుకు తాను సుముఖంగా లేనని గతంలో పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. దీంతో ఆయన్ను ఒప్పించడం ద్వారా దీపా వెంకట్‌ కు ఈ పదవి అప్పజెప్పాలని ముఖ్యమంత్రి కచ్చితమైన అభిప్రాయంతో ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ దీపా వెంకట్ ఈ పదవి పట్ల ఆసక్తి కనబరచకుంటే ఇక టీడీపీకి చెందిన వ్యక్తికే ఈ చైర్మన్ గిరి అవకాశం దక్కనుంది. దీంతో పాటు నుడా పాలకవర్గంలో ఉండే 20 మంది సభ్యుల్లో జిల్లాకు చెందిన బీజేపీ నేతలకు కూడా అవకాశం కల్పించాలని స్థానిక బీజేపీ నేతలు తమ రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే పనిలో ఉన్నారు. మొత్తానికి నుడా ఏర్పాటుకు ముందే టీడీపీ-బీజేపీల నడుమ లుకలుకలు మొదలుకాగా ఏర్పడిన తర్వాత నుడా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/