Begin typing your search above and press return to search.

దావుద్ దందా బాగుందా?

By:  Tupaki Desk   |   30 Aug 2015 8:04 AM GMT
దావుద్ దందా బాగుందా?
X
దావుద్ ఇబ్ర‌హీం... అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల‌పై అవ‌గాహ‌న వారెవ్వ‌రికీ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఇన్నాల్లు మాఫియా న‌డిపించి, హ‌వాల మార్గంలో సొమ్ములు సంపాదించ‌డం, దొమ్మీలు, బెదిరింపులు చేసిన దావుద్ ఇపుడు కొత్త మార్గం ఎంచుకున్నాడు. పొరుగుదేశం పాకీ-స్థాన్‌ లో సేఫ్‌ గా ఉన్న దావుద్ కొత్త బిజినెస్‌ ను షురూ చేసాడంట‌. అది కూడా ప్ర‌స్తుతం చేస్తున్న దందాల కంటే పూర్తి లాభ‌సాటి అయిన‌ది ఎంచుకున్నాడంట‌.

దావుద్ గ్యాంగ్ అరాచ‌కాల‌కు సంబంధించి భార‌త ఇంటెలిజెన్స్ సంస్థ‌లు ర‌హ‌స్యంగా వెంటాడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా విస్మ‌యం క‌లిగించే అనేక సాక్షాదారాలు దొరికాయి. ఇందులో అనేక ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి. కాంగో, సియోరా లియోన్‌, అంగోలా వంటి ఆఫ్రికా దేశాలు వ‌జ్రాల‌కు మారుపేరు. అక్క‌డి కొంద‌రు బ‌డా పారిశ్రామిక‌వేత్త‌లు వెళ్లి..ఆదివాసీల‌ను బానిస‌లుగా మార్చుకొని గ‌నులు త‌వ్వించి వ‌జ్రాలు వెలికితీస్తుంటారు. మాట‌ విన‌ని వారిపై అత్యంత క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తూ చంపివేస్తుంటారు కూడా. ఇలా కొన్ని ల‌క్ష‌ల‌మంది ఇప్ప‌టికి మ‌ర‌ణించారు. అలా సంపాదించిన వ‌జ్రాల‌ను విదేశీయుల‌కు అమ్ముతుంటారు. మాట‌విన‌ని వారిపై కాల్పులు జ‌ర‌ప‌డం వంటి ఘ‌ట‌న‌లు ఎన్నో జ‌రుగుతుంటాయి కాబ‌ట్టే....రక్త‌పాతం ద్వారా ఆఫ్రికాలో దొరికే ఆ వ‌జ్రాల‌కు బ్లడ్ డైమండ్స్ అని పేరు వ‌చ్చింది.

అయితే బానిస‌ల‌ను బెదిరించేందుకు తిరుగుబాటు ద‌ళాల‌కు కావాల్సిన ఆయుదాలు, డబ్బులు, ఇత‌ర ముడిస‌రుకును కొంద‌రు స‌ప్లై చేస్తారు. వాటికి బ‌దులుగా ముడి వ‌జ్రాలు తీసుకొని విదేశాల‌కు పంపుతారు. ఇలా వ్యాపారం చేసే ద‌ళారుల్లో ర‌హ‌మ‌త్ ఒక‌డు. వీడే దావుద్‌ కు వ‌జ్రాలు ముడి వ‌జ్రాలు స‌ర‌ఫ‌రా చేస్తున్నాడు. దావుద్ వాటిని ఆఫ్రిక‌న్‌ యువ‌తీ, యువ‌కుల ద్వారా విమాన‌మార్గంలో దుబాయ్‌ కి చేర్చుతాడు. ఇలా ఒక్కో ట్రిప్‌ లో రూ.6 కోట్ల విలువైన వ‌జ్రాలు పంపిస్తుంటారు. అయితే ఇలా డీల్ చేసినందుకు క‌మిష‌న్ రూ. 6 లక్ష‌లు. దుబాయ్ వ‌చ్చిన ఆ వ‌జ్రాలు దావుద్ సొంత కంపెనీ అయిన అల్ నూర్‌ లో సాన‌పెడ‌తారు. దీన్ని దావుద్ మ‌నిషి అయిన ఫిరోజ్ ఒయాసిస్ చూసుకుంటాడు.

చిత్రంగా ఫిరోజ్ అనేవాడు భార‌తీయుడు. త‌మిళ‌నాడుకు చెందిన వీడు మాతృభాష‌తో పాటు ఇంగ్లిష్‌, హిందీ, అర‌బీ కూడా బాగా మాట్లాడ‌గ‌ల‌డంట‌. వీడు వ‌జ్రాల‌ను సాన‌బెట్టిన త‌ర్వాత జావెద్ చుతాని అనే వ్య‌క్తికి అందజేస్తే అత‌ను విదేశాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తాడు. గ్యాంబ్లింగ్‌ లో ఆరితేరిన జావేద్ బుకీగా మారి దావుద్ ఇబ్ర‌హీంకు ద‌గ్గ‌ర‌య్యాడు. ఇపుడు సొంత మ‌నిషిగా మారిపోయాడు. ఈ ర‌కంగా సాగుతున్న‌ దావుద్ వ‌జ్రాల వ్యాపారంలో భార‌తీయులు ఇంకా ఎవ‌రైనా ఉన్నారా? ఉంటే వారి పాత్ర ఏంటి అనే విష‌యాల‌ను ఇంటెలిజెన్స్ సేక‌రిస్తోంది