Begin typing your search above and press return to search.

కేసీఆర్ కేబినెట్ గురించి కాంగ్రెస్‌కు కొత్త బాధ‌

By:  Tupaki Desk   |   23 Jan 2019 7:34 AM GMT
కేసీఆర్ కేబినెట్ గురించి కాంగ్రెస్‌కు కొత్త బాధ‌
X
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన కాంగ్రెస్ పార్టీ త‌న పోరాటాన్ని మ‌రో కొత్త పంథాలోకి మార్చింద‌ని అంటున్నారు. ఓ వైపు హోరాహోరీగా సాగుతున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల పోరులో ప‌రాజ‌యం దిశ‌గా పాల‌వుతున్న కాంగ్రెస్ పార్టీ ఊహించ‌ని అంశాన్ని తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ ను టార్గెట్ చేసింది. త‌న మంత్రివ‌ర్గ ఏర్పాటు త‌న ఇష్టం అన్న‌ట్లుగా ముఖ్య‌మంత్రి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వ్యాఖ్యానించింది. అయితే, కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న అంశం ఆ పార్టీ స్థితిగ‌తుల‌ను ప్ర‌స్తావిస్తోంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ గాంధీభవన్‌ లో తెలంగాణ‌లో జ‌రుగుతున్న కేబినెట్ తీరు ఆశ్య‌ర్యానికి గురిచేస్తోంద‌న్నారు. ఆర్టికల్‌ 164(ఎ) ప్రకారం మంత్రుల సంఖ్య 15 శాతం మించకూడదని - మంత్రుల సంఖ్య 12 కంటే తక్కువ ఉండకూడదన్న విషయాన్ని అటు సీఎం కానీ - ఇటు గవర్నర్‌ కానీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆర్థిక మంత్రి లేకుండా పరిపాలన ఎలా ఉంటుందన్నారు. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులు చాలా చోట్ల విజయం సాధించారని చెప్పారు. కొన్ని చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులనే టీఆర్ఎస్‌లో చేర్చుకొని విజయం సాధించారని ఆరోపించారు. మంత్రివర్గ ఏర్పాటే కాకుండా అధికార పార్టీలో మిగతా వ్యవహారాలన్నీ అత్యంత గోప్యంగా జరిగిపోతున్నాయి. తెలంగాణ క్యాబినెట్‌ ఏర్పాటులో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 శాఖలు - 298 విభాగాలు ఉండగా కేవలం ఒకే ఒక మంత్రి మహమూద్ అలీకి నాలుగు శాఖలు అప్పగించారని శ్రవణ్ గుర్తు చేశారు. ప్రస్తుత హోం మంత్రి హోం గార్డును కూడా బదిలీ చేయలేరని విమర్శించారు. నిరంతరం మంత్రుల సలహాలు - సూచనల ప్రకారం ప్రభుత్వాన్ని నడిపించాల్సి ఉంటుందని, అయితే మంత్రులే లేనప్పుడు ఎవరి సూచనల ప్రకారం నడుచుకుంటారని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో మూడో వంతు స్థానాల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు అభినందలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ముఖ్య నేతలంతా ఓటమి బాధతో ఉన్నా కార్యకర్తలు మాత్రం ఎత్తిన జెండాను దించకుండా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేశారన్నారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న తీరు ఆ పార్టీకి ఉన్న ప్ర‌జాస‌మ‌స్య‌ల అంశం లోపాన్ని చాటిచెప్తోంద‌ని ప‌లువురు అంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న పాల‌న త‌న ఇష్టం అంటున్న‌ట్లుగా సాగుతున్నార‌ని అయిన‌ప్ప‌టికీ ఆయ‌న పాల‌న గురించి గ‌వ‌ర్న‌ర్‌కు లేఖ రాయడం ఆ పార్టీ స్థితికి అద్దం ప‌డుతోంద‌ని చ‌ర్చించుకుంటున్నారు.