Begin typing your search above and press return to search.

ఓటుకు ఆ ఎమ్మెల్యేను అంబులెన్స్ లో తెస్తార‌ట‌

By:  Tupaki Desk   |   17 July 2017 7:01 AM GMT
ఓటుకు ఆ ఎమ్మెల్యేను అంబులెన్స్ లో తెస్తార‌ట‌
X
రాష్ట్రప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేశ ప్ర‌ధ‌మ పౌరుడ్ని ఎన్నుకునే ఈ ఎన్నిక తుది ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న విష‌యంపై ఎవ‌రికి ఎలాంటి ఉత్కంఠ లేదు. ఎందుకంటే.. తుది ఫలితం ఎలా ఉండ‌నుంద‌న్న‌ది అంద‌రికి తెలిసిన ముచ్చ‌టే.

ఇదిలా ఉంటే.. ఈ ఎన్నిక‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమైనా ఉందంటే.. అది క్రాస్ ఓటింగ్ మీద‌నే. తాము చెప్పిన‌ట్లు కాకుండా.. ఎవ‌రైనా ఎంపీ.. ఎమ్మెల్యేలు గుట్టుచ‌ప్పుడు కాకుండా త‌మ ఆత్మ‌ప్ర‌భోదానుసారంతో ఓటు వేస్తారా? అన్న క్వ‌శ్చ‌న్ మాత్ర‌మే ఉంది.

ఇక‌.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార‌ప‌క్షాలు.. ఏపీలోని విప‌క్షం సైతం బీజేపీ అభ్య‌ర్థికే మ‌ద్ద‌తు ఇవ్వ‌నుండ‌టంతో.. కోవింద్ కు భారీగా ఓట్లు న‌మోదు కావ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఇక‌.. ప్ర‌ధాని మోడీకి మాట ఇచ్చిన నేప‌థ్యంలో.. త‌మ పార్టీ త‌ర‌ఫు నుంచి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా.. అన్ని ఓట్లు కోవింద్‌కు ప‌డేలా చేయాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్ప‌టికే పార్టీ నేత‌ల‌కు ఇందుకు సంబంధించిన స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో అధినేత ఆదేశాల్ని తూచా త‌ప్ప‌కుండా ఉండేందుకు వీలుగా అన్ని ఓట్లు న‌మోద‌య్యేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

అది కూడా ఎంత ఎక్కువ‌గా అంటే.. అనారోగ్యంతో కొద్దిరోజులుగా ఆసుప‌త్రిలో ఉంటున్న పెద్ద‌ప‌ల్లి ఎమ్మెల్యే.. టీఆర్ ఎస్ నేత దాస‌రి మ‌నోహ‌ర్ రెడ్డిని అంబులెన్స్ లో తీసుకొచ్చి ఓటు వేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రప‌తి ఎన్నిక కోసం ఆయ‌న్ను అపోలో ఆసుప‌త్రి నుంచి ప్ర‌త్యేకంగా అసెంబ్లీకి తీసుకొచ్చి.. ఓటు వేయించిన అనంత‌రం ఆసుప‌త్రికి త‌ర‌లించ‌నున్నారు. ఈ నేత ఒక్క‌రే కాదు.. అధికార‌ప‌క్షానికి చెందిన నేత‌లు ఎవ‌రైనా అనారోగ్యంతో ఉంటే.. వారిని ప్ర‌త్యేకంగా అంబులెన్స్ ల‌లో తెప్పించి ఓటు వేయాల‌ని కేసీఆర్ ఆదేశించారు. దీంతో.. ఆ త‌ర‌హా ఏర్పాట్ల‌ను పూర్తి చేశాయి పార్టీ వ‌ర్గాలు. కేసీఆర్ మాటా.. మ‌జాకానా?