Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ ర‌చ్చ‌...క‌న్న‌డ ట్ర‌బుల్ షూట‌ర్ ఎంట్రీ...

By:  Tupaki Desk   |   18 Nov 2018 5:35 AM GMT
టీ కాంగ్రెస్ ర‌చ్చ‌...క‌న్న‌డ ట్ర‌బుల్ షూట‌ర్ ఎంట్రీ...
X
ఈ ఏడాది దేశ‌వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ప‌రిణామం అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. కాంగ్రెస్ అధిష్టానం అనేక వ్యూహాలు ప‌న్నిన‌ప్ప‌టికీ...అన్నింటికీ మించి జేడీఎస్‌-కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌ను చేజార‌కుండా చేసి ఆ పార్టీ కూట‌మే గ‌ద్దెనెక్కేందుకు కార‌ణ‌మైంది కన్నడ ప్రజలకు డీకేఎస్‌ గా సుపరిచితుడైన మాజీ మంత్రి డీకే శివకుమార్. క్లిష్ట పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను ఈగల్టన్ రిసార్ట్‌ కు తరలించి ఆతిథ్యం ఇవ్వడంతోపాటు హైదరాబాద్‌ కు తరలించడం - మళ్లీ కర్ణాటకకు సురక్షితంగా తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. ఈయ‌న తాజా దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది ఎవ‌రికోకాదు...మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ద‌న్ రెడ్డికి. ఇలా త‌న‌దైన శైలిలో ఆప‌రేష‌న్ నిర్వ‌హించిన డీకే శివ‌కుమార్ తాజాగా తెలంగాణ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ట్రబుల్ షూట‌ర్‌ గా ఆయ‌న రాజ‌కీయాలను డీల్ చేస్తున్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించడంతో ఆపార్టీకి రెబెల్స్‌ తాకిడి ఎక్కువైంది. ఇప్పటికే గాంధీభవన్‌ ముందు ఆందోళనలు - నిరసనలు కొనసాగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లోనూ తీవ్రమైన అసమ్మతి చెలరేగు తున్నది. దాదాపు 40మంది అసమ్మతి నేతలు ఇప్పటికే నామినేషన్లు వేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నారు. వీరందరిని బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ పార్టీ త్రిసభ కమిటిని రంగంలోకి దించింది. అసమ్మతి నేతలతో శనివారం - ఆదివారం చర్చలు జరపనుంది. ఈ త్రిసభ్య కమిటీలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి - మంత్రి మల్లాది కృష్ణారావు - కర్నాటక మంత్రి డికె శివకుమార్‌ ఉన్నారు.

ఈ ఎపిసోడ్ విష‌యంలో డీకే శివ‌కుమార్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాల‌ని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం పీఠం కోసం మెజార్టీ ఎమ్మెల్యేల లెక్క‌లు ఉత్కంఠ‌ను సృష్టిస్తున్న స‌మ‌యంలో క్యాంప్ రాజ‌కీయాల‌ను సైతం కాంగ్రెస్ పార్టీ - బీజేపీలు జోరుగా న‌డిపించాయి. త‌మ టీంలో ఉన్న ఎమ్మెల్యేల‌ను ఆయా పార్టీలు క్యాంప్‌ ల‌కు త‌ర‌లించాయి. ఈ రెండు పార్టీల‌కు చెందిన క్యాంప్ రాజ‌కీయాల‌కు నాయ‌క‌త్వం వ‌హించిన ఇద్ద‌రు ప్ర‌ముఖ నేత‌లు కావ‌డం క‌న్న‌డ రాజ‌కీయం మ‌రింత హీటెక్కించింది. ఆ ఇద్ద‌రే మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ద‌న్ రెడ్డి,. మాజీ మంత్రి డీకే శివ‌కుమార్‌. బీజేపీ ఎమ్మెల్యేల క్యాంప్‌కు సంబంధించి తెర‌వెనుక ఉండి `అన్నీ` చ‌క్క‌దిద్దింది గాలి జ‌నార్ద‌న్ రెడ్డి - ఆయ‌న సోద‌రులేన‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేని అంశం. బీజేపీ ప్ర‌లోభాల‌కు లొంగ‌కుండా అన్ని జాగ‌త్ర‌లు తీసుకుంటూ క్యాంప్‌ ను న‌డిపించింది మాజీ మంత్రి డీకే శివ‌కుమార్. దేశంలోనే అత్యంత ధ‌నికుడైన ప్ర‌జాప్ర‌తినిధిగా పేరొందిన శివ‌కుమార్ కాంగ్రెస్ క్యాంప్‌ న‌కు చెందిన ఎమ్మెల్యేలకు ``త‌గిన ఏర్పాట్లు`` చేసిన‌ట్లు చెప్తున్నారు. త‌న అఫిడ‌విట్లోనే రూ.730 కోట్ల ఆస్తుల‌ను చూపించిన శివ‌కుమార్ త‌ద్వారా ఆర్థికంగా బ‌ల‌మైన నాయ‌కుడిగా గుర్తింపును పొందారు. అలా మైనింగ్ కింగ్‌ గాలి జ‌నార్ద‌న్ రెడ్డి ఎత్తుల‌కు పై ఎత్తులు వేసిన‌ డీకే శివ‌కుమార్ త‌మ కూట‌మి అధికారం చేజిక్కుంచునేలా చేశారు.

కాగా, గతంలోనూ కాంగ్రెస్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఆయన అండగా నిలిచారు. 2002లో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు.. అప్పటి సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తమ ఎమ్మెల్యేలను కర్ణాటకకు తరలించారు. ఎమ్మెల్యేల రక్షణ బాధ్యత తీసుకున్న శివకుమార్ వారిని ఈగల్టన్ రిసార్ట్‌ లో వారంరోజులు ఉంచి, సురక్షితంగా ముంబైకి చేర్చారు. ఆ సందర్భంలో విలాస్‌ రావు ప్రభుత్వం విజయం సాధించింది. గత ఏడాది ఆగస్టులో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించారు. వారికి కూడా ఆతిథ్యమిచ్చింది శివకుమారే. అప్పుడు కూడా పటేల్ విజయం సాధించారు. మూడు సందర్భాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి డీకే శివకుమార్ ఆపద్బాంధవుడిగా నిలిచారు.