Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాలపై కేసీఆర్ కుట్ర కోణాన్ని విప్పారు

By:  Tupaki Desk   |   26 Sep 2016 7:52 AM GMT
కొత్త జిల్లాలపై కేసీఆర్ కుట్ర కోణాన్ని విప్పారు
X
అంతా అనుకున్నట్లే జరిగినట్లు కనిపించినా..కొత్త జిల్లాల ఏర్పాటు ఇష్యూలో అనుకున్న దాని కంటే ఎక్కువ రచ్చ జరిగిందని చెప్పాలి. తెలంగాణ సర్కారు ఊహించిన దాని కంటే ఎక్కవే సర్కారు వ్యతిరేకత మూటగట్టుకుందని చెప్పక తప్పదు. కొత్త జిల్లాల మీద భారీ కసరత్తు చేయటంతోపాటు.. అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయటం ద్వారా అందరిని కలుపుకుపోతున్నట్లుగా కేసీఆర్ తీరు కనిపించింది. కానీ.. అలాంటిదేమీ లేదన్న విషయం ఆ తర్వాత ఆయన వేసిన అడుగుల్నిచూస్తే అర్థమవుతుంది.

కొత్త జిల్లాలకు సంబంధించి తాను అనుకున్నట్లే వ్యవహరించారే తప్పించి.. విపక్షాల సలహాల్ని.. సూచనల్ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదన్న విమర్శ రోజురోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వం ఊహించిన దాని కంటే ఎక్కువగానే కొన్నిజిల్లాల్లో నిరసన‌లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గద్వాల్ ను కొత్త జిల్లాగా ప్రకటించాలని కోరుతూ 72 గంటల బంద్ విజయవంతంగా జరిగింది.

మూడు రోజుల బంద్ లో భాగంగా గద్వాల జిల్లా సాధన ఐకాస నేతృత్వంలో రోడ్లను బ్లాక్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ.. వాటిని పరిగణలోకి తీసుకోకుండా గద్వాలను కొత్త జిల్లాల లిస్ట్ లో పెట్టలేదని ఆరోపించారు. వేలాది పుస్తకాలు చదివిన మేధావిగా కేసీఆర్ ను కీర్తిస్తుంటారని.. అలాంటి కేసీఆర్ నడిగడ్డ ప్రాంతానికి ఉన్న చరిత్రను.. ప్రత్యేకతను చదవలేదా? అని ప్రశ్నించారు.

కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్న ఆమె.. జిల్లాలకు సంబంధించిన తుది నోటిఫికేషన్ ను ముందే విడుదల చేస్తే కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఇప్పటివరకూ విడుదల చేయలేదంటూ కుట్ర కోణాన్ని ఆవిష్కరించారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా కాకుండా కళ్లకు గంతలు కట్టుకొని చేస్తున్నారంటూ దుయ్యబట్టిన ఆమె.. దసరా రోజున కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయటం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. కొత్త జిల్లాల గురించి ఎవరెన్ని విమర్శలు చేసినా.. ఆరోపణలు చేసినా లైట్ తీసుకుంటూ తాను చేయాల్సింది చేసేయాలన్న ధోరణిలో ఉన్న కేసీఆర్ సర్కారుకు డీకే లాంటి వారి మాటలు వినిపించే అవకాశమే ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.