Begin typing your search above and press return to search.

క్రాస్ ఓటింగ్.. తీవ్రమైన కన్ఫ్యూజన్ అయ్యిందా?

By:  Tupaki Desk   |   17 April 2019 2:30 PM GMT
క్రాస్ ఓటింగ్.. తీవ్రమైన కన్ఫ్యూజన్ అయ్యిందా?
X
మన దగ్గర క్రాస్ ఓటింగ్ అనేది అంత తేలికగా జరిగే వ్యవహారం కాదు. అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటుంది. గత ఎన్నికల ఫలితాలనే పరిశీలిస్తే ఇలాంటి విషయాలు అర్థం అవుతాయి. అప్పుడు పార్టీలు గెలిచిన ఎంపీ- ఎమ్మెల్యే సీట్ల నిష్పత్తి దాదాపుగా సమానంగా ఉంది.

అయితే ఈ సారి ఏపీలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది ఒక విశ్లేషణ. అయితే అసలు కథ ఏమిటనేది ఫలితాలు వెల్లడి అయితే కానీ తెలియదు. మీడియా వాళ్లు మాత్రం క్రాస్ ఓటింగ్ అని అంటున్నారు. ప్రత్యేకించి గోదావరి - ఉత్తరాంధ్ర జిల్లాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని మీడియా కథనాలు చెబుతూ ఉన్నాయి.

ఆ విషయంలో ఓటర్లు ముందుగానే నిర్ణయాలు తీసుకున్నారని, తమకు నచ్చినట్టుగా ఎమ్మెల్యే ఓటు ఒక పార్టీ వారికి, తాము వేయాలనుకున్న ఎంపీ అభ్యర్థికి మరో ఓటును వేయడానికి వారు ముందే ప్రిపేర్ అయిపోయారని మీడియా వర్గాలు విశ్లేషిస్తూ ఉన్నాయి.

వివిధ సమీకరణాల లెక్కల ప్రకారం జనాలు ఆ నిర్ణయం తీసుకున్నారని - ఎంపీ ఓటు - ఎమ్మెల్యే ఓటు ఒకే పార్టీకి వేయాలని చాలా మంది అనుకోలేదని.. వేర్వేరు పార్టీల వారీకే వేసేందుకు వారు మొగ్గు చూపినట్టుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అయితే అలా జనాలు నిర్ణయించుకున్నాకా.. పోలింగ్ బూత్ లకు వెళ్లగా అక్కడ కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యిందనేది ఒక వాదన. అదేమిటంటే.. ఏది ఎంపీ ఎన్నికకు సంబంధించి ఈవీఎం - మరేది ఎమ్మెల్యే ఎన్నికకు సంబంధించిన ఈవీఎం అనేది.. జనాలు తేల్చుకోలేకపోయారనే టాక్ వినిపిస్తోంది.

పోలింగ్ బూత్ లలోకి వెళ్లగానే అక్కడ ఏది ఎంపీ ఓటుకు సంబంధించినది, మరేది ఎమ్మెల్యే ఓటుకు సంబంధించినది అనేది తేల్చుకోవడం గ్రామీణ ప్రాంతాల వారీకి, పెద్దగా అవగాహన లేని వారికి కష్టం అయ్యిందని అంటున్నారు. కేవలం గుర్తులను బట్టే ఓట్లు పడతాయని చెప్పనక్కర్లేదు.

లెక్క ప్రకారం అయితే ముందుగా ఎంపీ ఎన్నికకు సంబంధించిన ఓటు వేయించాలి, ఆ తర్వాత ఎమ్మెల్యే. ఆ విషయం కూడా పోలింగ్ కు ముందు చాలా మందికి తెలియదు. ఇక మరి కొన్ని పోలింగ్ బూతులలో ఆ నియామాన్నే పాటించలేదు. ఏది ఎంపీ ఈవీఎం, ఏది ఎమ్మెల్యే ఈవీఎం అనే బోర్డులు కూడా సరిగా లేవు. ఈవీఎంలను తెరిపరా చూసి.. అభ్యర్థుల పేర్లను, గుర్తులను గమనించిన వారికే ఏ ఈవీఎం దేనికి అనేది పూర్తిగా అర్థం అయ్యింది.

అలా అర్థం చేసుకోలేని వారే.. అప్పటికే క్రాస్ ఓటింగ్ కు ప్రిపేర్ అయి వచ్చి లేని కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్ చేయాలని ఫిక్స్ అయ్యాకా.. పోలింగ్ సెంటర్ లో తలెత్తిన గందరగోళంతో వారు ఎలా పడితే అలా ఓటేశారని.. ఇలాంటి ఓట్లే చాలా చోట్ల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని - ఈ కన్ఫ్యూజన్ తో కొందరు అభ్యర్థుల జాతకం తారుమారు అయ్యిందని విశ్లేషకులు అంటున్నారు.