Begin typing your search above and press return to search.

మోడీపై ఫైట్‌- కామ్రేడ్స్ బిగ్ మిస్టేక్‌

By:  Tupaki Desk   |   19 Nov 2017 7:01 AM GMT
మోడీపై ఫైట్‌- కామ్రేడ్స్ బిగ్ మిస్టేక్‌
X
మోడీకి మాంచి బూస్టింగ్ ఇచ్చిన మూడీస్ రేటింగ్ విషయంలో సీపీఎం కార్యకర్తలు కొందరు పొరపాటు పడడంతో ఆస్ర్టేలియా మాజీ క్రికెటర్‌ టామ్ మూడీకి కష్టాలు వచ్చిపడ్డాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ లో భారత్ రేటింగ్‌ ను ప్రఖ్యాత మూడీస్ సంస్థ అప్‌ గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే... పెద్ద నోట్ల రద్దు - జీఎస్టీ వంటి నిర్ణయాలతో విపక్షాలు - ముఖ్యంగా వామపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ ప్రభుత్వానికి - బీజేపీకి ఇది మంచి ఎనర్జీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కొందరు బీజేపీ - మోడీ వ్యతిరేకులు మూడీసీ గ్రేడింగ్‌ ను తప్పుపట్టగా.. మరికొందరు గతంలో మూడీస్ ను మోడీ మద్దతుదారులు తప్పుపట్టడాన్ని గుర్తు చేశారు. అయితే.. సీపీఎం సైబర్ ఆర్మీగా చెప్పుకొనే సోషల్ మీడియా గ్రూపు ఒకటి మాత్రం ఈ వ్యవహారంలో తలదూర్చి వ్యవహారాన్ని రచ్చరచ్చ చేసింది. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని, అందులోనూ ఇండియన్ పాలిటిక్సుతో అస్సలు సంబంధం లేని ఆస్ర్టేలియా మాజీ క్రికెటర్ - హైదరాబాద్ సన్ రైజర్స్ ఐపీఎల్ టీం కోచ్ టామ్ మూడీని ఇందులోకి లాగింది. తన అజ్ఞానంతో మూడీస్‌ ను మూడీగా పొరపాటు పడి ఆయనపై విమర్శలు చేయడమే కాకుండా ఏకంగా ఆయన ఫేస్ బుక్ ఖాతాలో అభ్యంతరకర పదజాలం ఉపయోగిస్తూ పోస్టులు చేయడం వివాదానికి దారితీసింది. ఆయన పోస్టింగుల కింద కామెంట్లుగా నోటికొచ్చినట్లు రాయడం ప్రారంభించారు. దీంతో ఇండియన్ పాలిటిక్సులో జరుగుతున్న ఈ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని టామ్ మూడీ పేరు ఒక్కసారిగా ట్రెండ్ అయిపోయింది.

ఏమాత్రం ఛాన్సు దొరికినా మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడే సీపీఎం సైబర్ ఆర్మీ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీనే రేటింగ్ ఇచ్చారని పొరపాటు పడి ఇదంతా చేసింది. ‘మోదీ దగ్గర బాగా కమీషన్లు తీసుకుని మంచి రేటింగ్ ఇచ్చారని మేం భావిస్తున్నాం. మూడీ షేమ్ షేమ్’’ అని పోస్టులు పెట్టారు. ‘‘2019లో మోదీ మట్టి కరవడం ఖాయం. అది మీరు చూస్తారు.. యూ..... మూడీ’’ అని తిట్ల వర్షం కురిపించింది.

అయితే... నెటిజన్లలో చాలామందికి మూడీస్ కు , టామ్ మూడీకి తేడా తెలియడంతో దీనికి స్పందించిన కొందరు కామెంట్ రాస్తూ.. అసభ్య రాతలు మానుకోవాలని, మూడీ అమాయకుడని, ఆయనెప్పుడూ మోదీ ప్రభుత్వానికి రేటింగ్ ఇవ్వలేదని రాశారు. మరికొందరు సీపీఎం కార్యకర్తలను ఆడుకున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టులకు ఎంతో జ్ఞానం ఉండేదని, ఇప్పుడు కామన్ సెన్సు కూడా ఉండడం లేదని సెటైర్లు వేశారు. దీంతో సైబర్ ఆర్మీ సైలెంటయిపోయింది. అయితే...మూడీ మాత్రం దీనిపై ఇంతవరకు ఏమీ స్పందించలేదు.