Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ సెల్ఫీలు యూత్‌ లో మెగా హిట్‌

By:  Tupaki Desk   |   14 Nov 2017 7:04 PM GMT
జ‌గ‌న్ సెల్ఫీలు యూత్‌ లో మెగా హిట్‌
X
ప్ర‌స్తుత కాలం సెల్ఫీల జ‌మానాగా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. సెల‌బ్రిటీలు క‌లిసిన‌ప్పుడు వారితో సెల్ఫీ తీసుకొని...ఆ సంద‌ర్భాన్ని గుర్తుండిపోయేలా చేసుకుంటున్నారు. సినీన‌టులు - క్రికెట‌ర్లు - బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్లు...ఇటీవ‌లి కాలంలో రాజ‌కీయ నాయ‌కులు కూడా..ఈ జాబితాలో చేరిపోయారు. సెల్ఫీల్లో రాజ‌కీయ నాయ‌కుల జాబితా చూస్తే జాతీయ రాజ‌కీయాల్లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ టాప్‌ లో ఉంటారు. ఇక తెలుగు రాష్ర్టాల విష‌యంలో అయితే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ టాప్‌ లో ఉంటారు. ఒక‌రకంగా చెప్పాలంటే...యూత్‌ లో రాజ‌కీయ నాయ‌కుల సెల్పీల క్రేజ్ పెంచింది కేటీఆర్ అని చెప్పుకోవ‌చ్చు. ఏ ప్రోగ్రాం జ‌రిగినా అభిమానంతో ఎవ‌రైనా అడిగితే దాదాపు ఐదు నిమిషాల వ‌ర‌కు స‌మ‌యం కేటాయించి మ‌రీ కేటీఆర్ సెల్ఫీలు దిగుతుంటారు. ఇప్పుడు కేటీఆర్ స‌ర‌స‌న చేరారు...ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

ఔను, జ‌గ‌న్ ఆ జాబితాలో త‌న పాద‌యాత్ర సంద‌ర్భంగా చేరిపోయారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో న‌వంబ‌ర్ 6 తేదీ నుంచి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా యువ‌త నుంచి మంచి ఆద‌ర‌ణ జ‌గ‌న్‌కు ద‌క్కుతోంది. ఈ పాద‌యాత్ర సంద‌ర్భంగా ఎక్కువ‌గా యువ‌త‌తో క‌నెక్ట్ అయ్యేలా జ‌గ‌న్ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసిన సంగ‌త తెలిసిందే. వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసేందుకు వ‌చ్చిన విద్యార్థులు, యువ‌త ఆయ‌న‌తో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.దీంతో పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ కూడా కొంత స‌మ‌యం కేటాయించి విద్యార్థులు, యువ‌త‌తో సెల్ఫీలు దిగేందుకు ముచ్చ‌ట ప‌డుతున్నార‌ని చ‌ర్చ సాగుతోంది.