Begin typing your search above and press return to search.

సాథ్వీ బ్రెస్ట్‌ కేన్స‌ర్ గోమూత్రంతో న‌య‌మైంద‌ట‌!

By:  Tupaki Desk   |   23 April 2019 6:57 AM GMT
సాథ్వీ బ్రెస్ట్‌ కేన్స‌ర్ గోమూత్రంతో న‌య‌మైంద‌ట‌!
X
ఆసుప‌త్రులు మూసేయండి. మందుల షాపులు క్లోజ్ చేయండి. స‌మ‌స్య ఏదైనా ప‌రిష్కారం మీకు ద‌గ్గ‌ర‌గా ఉండే ఆవుతోనే ఉండొచ్చు. అనారోగ్యం వ‌స్తే ఆవుకు పూజ చేయండి. ఆవు మూత్రం.. గోమూత్రంతో కూడిన ఉత్ప‌త్తులు వాడండి. మీ జ‌బ్బులు త‌గ్గే వీలుంది. ఇలాంటి మాట‌లు చెబితే.. పిచ్చోడిగా చూడ‌ట‌మే కాదు.. అలాంటి వారికి దూరంగా ఉండాల‌నుకోవ‌టం ఖాయం. క‌చ్చితంగా ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు కానీ.. ఒక‌ప‌ట్టాన న‌యం కాని రోగాల‌కు గోమూత్రం ది బెస్ట్ అన్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేసే బ్యాచ్ కొంద‌రు క‌నిపిస్తుంటారు.

సైంటిఫిక్ గా చూసిన‌ప్పుడు గోవు చాలా పాజిటివ్ అని.. దానికుండే విశిష్ఠ‌మైన గుణంతో మనిషికి మంచి జ‌రుగుతుంద‌ని చెప్ప‌టాన్ని మేం వ్య‌తిరేకించ‌టం లేదు. కాకుంటే.. స‌మ‌స్య‌ల్లా.. అన్ని స‌మ‌స్య‌ల‌కు జిందా తిలిస్మాత్ ప‌రిష్కారమ‌న్న‌ట్లుగా.. అన్ని రోగాల‌కు గోవు ప‌రిష్కారం ఎంత మాత్రం కాద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. తాజాగా వివాదాస్ప‌ద బీజేపీ నేత‌.. తాజా భోపాల్ బీజేపీ అభ్య‌ర్థి సాథ్వీ ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఆమె చేసిన వ్యాఖ్య వైర‌ల్ గా మార‌ట‌మే కాదు.. ప‌లువురి నోటి వెంట మాట రాకుండా చేస్తోంది. భోపాల్ బీజేపీ అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన అనంత‌రం మాట్లాడిన ఆమె.. తాను గోమూత్రం.. దానికి సంబంధించిన ఉత్ప‌త్తులు వినియోగించ‌టం కార‌ణంగా త‌న బ్రెస్ట్ కేన్స‌ర్ న‌య‌మైన‌ట్లు చెప్పారు. గో మూత్రంతో చాలా ప్రాంతాల్లో వ్యాధులు న‌య‌మ‌వుతాయ‌ని ఆమె చెప్పారు.

ఆవు మూత్రంతో పాటు.. ఆవుల ఉత్ప‌త్తులు ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ని.. ఆవు మూత్రం తాగినందుకే త‌న కేన్స‌ర్ న‌య‌మైన‌ట్లు చెప్పారు. తాను బ్రెస్ట్ కేన్స‌ర్ తో ఇబ్బంది ప‌డిన‌ప్పుడు గోమూత్రంతో పాటు.. పంచ‌గ‌వ్వ క‌లిపిన ఆయుర్వేద ఉత్ప‌త్తులు తీసుకున్న‌ట్లు చెప్పారు. గోమాత శ‌రీరాన్ని రుద్ద‌టంతో బ్ల‌డ్ ప్ర‌ష‌ర్ అదుపులో ఉంటుంద‌ని.. గోమాత వెనుక‌.. మెడ నిమిరితే ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంద‌ని చెప్పారు. మొత్తానికి సాథ్వీ మేడ‌మ్ గారు నోరు విప్పితే.. ఆమె మాట‌ల‌న్నీ గోవుల చుట్టూనే తిర‌గ‌టం క‌నిపిస్తుంది.