Begin typing your search above and press return to search.

అవినీతి పోగొట్టే స్థితిలో నేను లేను - సీఎం

By:  Tupaki Desk   |   12 Jun 2018 7:50 AM GMT
అవినీతి పోగొట్టే స్థితిలో నేను లేను - సీఎం
X
కొద్ది రోజుల క్రితం జ‌రిగిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు, కుమార స్వామి ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం వంటి ప‌రిణామాలు పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ను త‌ల‌పించిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ తో కొత్త కాపురం మొద‌లుపెట్టిన సీఎం కుమార స్వామికి ....మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ రూపంలోనే అగ్ని ప‌రీక్ష ఎదురైంది. ఇక పాల‌న‌పై కుమార స్వామి దృష్టి పెట్టే క్ర‌మంలో ఆయ‌న ప‌లు పెను స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి ఉంది. ఓ వైపు మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌ని సొంత‌ పార్టీ ఎమ్మెల్యేల‌ను బుజ్జ‌గించ‌డం....మ‌రోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను క‌లుపుకొని ముందుకు పోవ‌డం....ఇలా కుమార స్వామి ముందు క‌ఠిన‌మైన ప‌రిస్థితులు ఉన్నాయి. దీనికి తోడు , ఈ రెండు పార్టీల మ‌ధ్య ఉన్న చిన్న చిన్న విభేదాల‌ను క్యాస్ చేసుకొని ....ఎమ్మెల్యేల‌ను త‌మ‌వైపుకు లాగేసి అధికారం చేప‌ట్టాల‌ని గోతికాడ న‌క్క‌లాగా కాచుకున్న బీజేపీతో కుమార స్వామి చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలోనే తాను చేప‌ట్ట‌బోయే పాల‌న‌పై కుమార స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అవినీతి నిర్మూల‌న‌కు తాను నడుం బిగించిన వెంట‌నే త‌న సీఎం ప‌ద‌వి కోల్పోయే అవ‌కాశ‌ముంద‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బెంగళూరులోని గాంధీభవన్ ను కుమార స్వామి తొలిసారి సందర్శించారు. క‌ర్ణాట‌క‌లో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై సీఎం కుమార స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ ప్ర‌కారం సమాజంలో పాతుకుపోయిన అవినీతిని నిర్మూలించడం అంత సులువైన విష‌యం కాద‌న్నారు. అవినీతిని రూపుమాపాలని శృంగేరీ పీఠాధిపతి చేసిన సూచ‌న నేప‌థ్యంలో కుమార స్వామి ఈ వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ముల్లును ముల్లుతోనే తీయాలన్న పంథాలో అవినీతి నిర్మూలనకు కృషి చేస్తానన్నారు. తనకు ప్ర‌భుత్వ ఏర్పాటుకు పూర్తిస్థాయి మెజారిటీ లేదు గ‌నుక దూకుడుగా నిర్ణయాలను తీసుకోలేన‌ని చెప్పారు. అధికారుల బదిలీల కోసం విధాన స‌భ‌లో ఓ వ్య‌క్తి రూ.10 కోట్లు అడుగుతున్నట్టు తెలిసింద‌ని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడపగలనా? అని సందేహం వ‌స్తుంద‌ని అన్నారు. త‌న‌కు ప‌ద‌వి, డబ్బు మీద ఆశ‌లేద‌ని, ఇంకా ఎన్ని రోజులు బతుకుతానో తెలియదని వేదాంత ధోర‌ణిలో మాట్లాడారు. తాను సీఎం కావ‌డం త‌న తండ్రికి ఇష్టం లేదని చెప్పారు. సీఎం పోస్టును దేవెగౌడ కాంగ్రెస్ కే ఇచ్చార‌ని, కానీ, వారు మాత్రం తనకే ఆ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టార‌ని అన్నారు. త‌న‌కు రెండుసార్లు గుండె ఆపరేషన్ అయిన నేప‌థ్యంలో త‌న తండ్రి ...కాంగ్రెస్ నేతలతో ఆ విధంగా అన్నార‌ని చెప్పారు.