Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు ‘‘వాడు’’ దొరికాడు

By:  Tupaki Desk   |   29 July 2015 4:10 AM GMT
ఎట్టకేలకు ‘‘వాడు’’ దొరికాడు
X
ప్రేమించమంటూ వెంటపడి.. తన మాట కాదన్నదన్న కసితో అక్కాచెల్లెళ్లను హత్య చేసిన దుర్మార్గుడు అమిత్ సింగ్ పోలీసుల చేతికి ఎట్టకేలకు చిక్కాడు. కొడుకు చేసే వెధవ వేషాలకు అండగా నిలిచిన తండ్రి పుణ్యమా అని అమిత్ రెండు వారాలుగా పోలీసులకు చుక్కలు చూపించారు. ఓపిగ్గా.. అన్ని మార్గాల ద్వారా ప్రయత్నించిన పోలీసులు.. సమన్వయంతో ఈ కేసును చేధించి.. ఈ కసాయిని అదుపులోకి తీసుకున్నారు.

గత రెండు వారాల వ్యవధిలో దాదాపు ఆరు రాష్ట్రాలు తిరుగుతూ.. తప్పించుకున్న అమిత్.. అతి తెలివితో అడ్డంగా దొరికిపోయాడు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అక్కాచెల్లెళ్ల హత్య ఉదంతం ఒక కొలిక్కి వచ్చినట్లు అయ్యింది. అందుబాటులోకి వచ్చిన సాంకేతికత సాయంతో పోలీసులకు బురిడీ కొట్టిన అమిత్ ను .. అదే టెక్నాలజీ సాయంతో అరెస్ట్ చేయటం ఈ వ్యవహారంలో ఒక విశేషం.

అక్కాచెల్లెళ్లు యామినీ సరస్వతి (23).. శ్రీలేఖ (21) హత్యకు దారి తీసిన పరిస్థితుల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో ఇంటర్ సమయంలో క్లాస్ మేట్ అయిన శ్రీలేఖతో.. అమిత్ సింగ్ కు పరిచయం ఉంది. అప్పటి నుంచి తనను ప్రేమించాలంటూ శ్రీలేఖను వేధించేవాడు. 2014లో శ్రీలేఖ ఫ్యామిలీ షాద్ నగర్ నుంచి కొత్త పేట లోని గాయత్రీపురం వచ్చారు. దీంతో.. అమిత్ సైతం ఆమెకు దగ్గర కావాలన్న ఉద్దేశ్యంతో.. ఆమె ఇంటికి కాస్త దగ్గరల్లో రూం తీసుకొని ఉండసాగాడు.

అమిత్ వ్యవహారంపై శ్రీలేఖ తల్లి హైమావతి మూడుసార్లు వెళ్లి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. కొడుకును అదుపులోకి పెట్టటం పట్ల అమిత్ సింగ్ తండ్రి అమర్ సింగ్ ప్రయత్నించకపోవటంతో అమిత్ మరింత రెచ్చిపోసాగాడు. తన తండ్రికి శ్రీలేఖ తల్లి ఫిర్యాదు చేస్తుందన్న కసితో.. జూలై 14న ఆమె ఇంటికి వెళ్లి.. ఆమెను.. ఆమె అక్క సరస్వతిని కత్తితో పోడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన అక్కాచెల్లెళ్లు ఇద్దరూ చికిత్స పొందుతూ కన్నుమూశారు.

కొడుకు చేసిన వెధవ పనికి మందలించి పోలీసులకు లొంగిపోయేలా చేసినా బాగుండేది.కానీ.. అదేమీ చేయని అమిత్ తండ్రి అమర్.. దొంగచాటుగా కొడుక్కి సాయం చేసేవాడు. ఇందుకు నిదర్శనంగా తండ్రి వద్ద మూడు సిమ్ లు ఉంటే.. కొడుకు దగ్గర ఐదు సిమ్ లు రహస్యంగా వినియోగించేవారు. మీడియా.. సోషల్ నెట్ వర్క్స్ లోని సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు రాష్ట్రాలు మారుతూ.. పోలీసుల కళ్లు గప్పేవాడు. అదే సమయంలో.. అతనికి అవసరమైన ఆర్థిక సాయాన్ని తండ్రి బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసేవాడు. వాటిని డ్రా చేసుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

హత్య చేసిన రోజు ఉప్పల్ మీదుగా కాజీపేట వెళ్లి.. అక్కడ నుంచి రైల్లో మధ్యప్రదేశ్ లోని తమ స్వగ్రామానికి వెళ్లాడు. అక్కడికి పోలీసులు వచ్చే అవకాశం ఉందని గుర్తించి.. రైల్లో ఢిల్లీకి వెళ్లి.. అక్కడ నంచి అగ్రా.. జైపూర్.. జోధ్ పూర్.. అజ్మీర్ దర్గాకు వెళ్లాడు. అటు నుంచి సూరత్.. షిర్డీ లో మూడు రోజులున్న అమిత్.. మళ్లీ తమ స్వగ్రామమైన మధ్యప్రదేశ్ లోని మత్తురకు చేరుకొన్నాడు. తన ఆచూకీ కోసం పోలీసులు ఉత్తర భారతం మీద దృష్టి పెట్టిన నేపథ్యంలో.. దొంగచాటుగా హైదరాబాద్ కు వచ్చేసి.. సెటిల్ అవుదామన్న ఆలోచనలో కారును ఉపయోగించాడు.

మరోవైపు అమిత్ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు.. అతడి సెల్ ఫోన్.. అతని తండ్రి వినియోగించే రహస్య సిమ్ ల మీద దృష్టి సారించటంతో పాటు.. వారి బ్యాంకు ఖాతాల మీద కన్నేశారు. వారి ఫోన్ల మీద ప్రత్యేక దృష్టి సారించారు.

సమన్వయంతో అతగాడ్ని నగరశివారుల్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. అజ్మీర్ ఎందుకు వెళ్లావన్న పోలీసుల ప్రశ్నకు బదులిస్తూ.. తాను ప్రేమించిన శ్రీలేఖ మరణించిన నేపథ్యంలో ఆమె ఆత్మతో మాట్లాడాలని బాబాను కోరేందుకు వెళ్లానని.. 40రోజుల తర్వాత రావాలని చెప్పటంతో వెనక్కి తిరిగి వచ్చేశానని పేర్కొన్నాడు. కొడుకు చేసిన వెధవ పనిని నిత్యం సమర్థించిన ఆ దుర్మార్గ తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.