Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ఖ‌జానా ఖాళీ..చాయ్‌ కి డ‌బ్బుల్లేవ‌ట‌

By:  Tupaki Desk   |   23 May 2018 2:59 PM GMT
కాంగ్రెస్ ఖ‌జానా ఖాళీ..చాయ్‌ కి డ‌బ్బుల్లేవ‌ట‌
X
మారిన రాజ‌కీయ ప‌రిస్థితులు...కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దెబ్బకు ఒక్కో రాష్ర్టాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. క‌నాక‌ష్టంగా ఆ పార్టీ త‌న కార్య‌క‌లాపాలు నిర్వ‌హించుకుంటోంది. ఎందుకంటే...ఆ పార్టీ ఖజానా ఖాళీ అయిపోయింది కాబ‌ట్టి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఆఫీస్‌ లకు చాలా కాలంగా డబ్బు పంపడం మానేశారు ఢిల్లీ పెద్దలు. కనీసం ఆఫీసులకు వచ్చే గెస్ట్‌ లకు టీలు ఇవ్వడం ఆపేశారంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందరు నేతలకు ఖర్చులు తగ్గించుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో ఆర్థికంగా బలంగా ఉన్న బీజేపీని ఢీకొట్టడం ఎలా అన్న ఆందోళన కాంగ్రెస్‌ లో కనిపిస్తోంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

మ‌న‌దేశంలో డబ్బుంటేనే రాజకీయ పార్టీకి మనుగడ. కానీ కాంగ్రెస్‌కు ఇప్పుడు ఆ డ‌బ్బే క‌రువైంది. 2013లో 15 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు కేవలం మూడు రాష్ర్టాలకు పరిమితమైంది. అధికారంలో ఉంటేనే క‌దా ఏ పార్టీకైనా విలువ. ఒక్కో రాష్ర్టాన్ని కోల్పోవ‌డ‌మో లేదా ఇంకేదైనా కార‌ణ‌మో కానీ...కాంగ్రెస్ కార్పొరేట్ల నుంచి పార్టీకి వచ్చే విరాళాలు భారీగా తగ్గిపోయాయి. మరోవైపు బీజేపీ ఏకంగా 20 రాష్ర్టాల్లో అధికారంలో ఉంది. దీంతో కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువ మొత్తంలో విరాళాలు వస్తున్నాయి. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బీజేపీకి వచ్చిన విరాళాలతో పోలిస్తే 25 శాతం మాత్రమే కాంగ్రెస్‌ కు వచ్చాయి. ఈ కాలంలో బీజేపీకి రూ.1034 కోట్లు రాగా.. కాంగ్రెస్‌ కు కేవలం రూ.225 కోట్లు మాత్రమే వచ్చాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే బీజేపీ విరాళాల్లో 81 శాతం పెరుగుదల ఉండగా.. కాంగ్రెస్‌ కు 14 శాతం తక్కువ విరాళాలు వచ్చాయి. కాంగ్రెస్ స్థితి ఎంత దయనీయంగా ఉందంటే.. డబ్బులు లేక విమాన టికెట్ బుక్ చేయడం ఆలస్యం కావడంతో ఓ సీనియర్ నేత సరైన సమయానికి ఓ ఈశాన్య రాష్ర్టానికి చేరుకోలేదట. ఈశాన్య రాష్ర్టాలైన త్రిపుర-నాగాలాండ్-మేఘాలయల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేయపోవడానికి కూడా నిధుల లేమే కారణమట. నిధుల కొరత కారణంగా ఎన్నికల్లో పోటీ చేయడం, పార్టీని నడిపించడం కూడా కష్టమవుతున్నది. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ కొత్తగా కట్టుకున్న లగ్జరీ కార్యాలయంలోకి తమ కార్యకలాపాలను మార్చగా.. నిధులు లేకపోవడంతో కాంగ్రెస్ కార్యాలయం ఇంకా నిర్మాణంలో ఉండటం గమనార్హం.

కాంగ్రెస్‌ దీన‌స్థితికి కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ దివ్యా స్పందన చేసిన ప్ర‌క‌ట‌న కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. ``మా దగ్గర డబ్బు లేదు`` అని ఆమె ప్ర‌క‌టించ‌డం గమనార్హం. చివరికి ఓ అభ్యర్థిని ఎన్నికల్లో నిలబెట్టడానికి క్రౌడ్ ఫండింగ్ ఆధారపడాల్సిన స్థాయికి కాంగ్రెస్‌ చేరింది. ప్ర‌స్తుతం బీజేపీతో పోలిస్తే కొత్తగా వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ కాంగ్రెస్‌కు రావడం లేదు. దీంతో ఆన్‌ లైన్‌ లో క్రౌడ్ ఫండింగ్‌ పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే కాంగ్రెస్‌ ను వదిలి బీజేపీ వైపు వెళ్లిపోయాయని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ దక్షిణాసియా అధికారి మిలన్ వైష్ణవ్ చెప్పారు. 2019 ఎన్నికల్లో డబ్బు పరంగా బీజేపీ మెరుగైన స్థితిలో ఉండబోతున్నదని ఆయన అన్నారు.