Begin typing your search above and press return to search.

లోకేష్ అడ్డుపుల్ల.. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లోకి!

By:  Tupaki Desk   |   20 March 2019 9:11 AM GMT
లోకేష్ అడ్డుపుల్ల.. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లోకి!
X
తెలుగుదేశం పార్టీలో చేరాలని అనుకున్న డీఎల్ రవీంద్రా రెడ్డికి నారా లోకేష్ బాబు అడ్డుపుల్ల వేశారని ప్రచారం జరుగుతూ ఉంది. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి రెడీ అని మొదట్లో డీఎల్ రవీంద్రా రెడ్డి వర్తమానం పంపించారట. మైదుకూరులో టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరూ లేరు. అక్కడ గెలిచి కూడా చాలా కాలం అయిపోయింది. గత రెండు మూడు పర్యాయాల్లో నెగ్గిందే లేదు. అలాంటి చోట డీఎల్ వచ్చి చేరడం తెలుగుదేశం పార్టీకి ప్లస్ పాయింటే అయ్యేది.

అందులోనూ రవీంద్రా రెడ్డి అక్కడ వరసగా ఎమ్మెల్యేగా నెగ్గిన వ్యక్తి. తనకంటూ కొంత క్యాడర్ ఉంది. మంచి గుర్తింపు ఉంది. ఇలాంటి నేపథ్యంలో రవీంద్రా రెడ్డి వచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి వర్తమానం పంపినా.. వారు పట్టించుకోలేదని తెలుస్తోంది. ప్రత్యేకించి నారా లోకేష్ బాబు ఆ విషయం పట్ల సానుకూలంగా స్పందించలేదట. తెలుగుదేశం పార్టీలో చాలా టికెట్లు లోకేష్ ఇష్టానుసారం తెగాయి అనేది తెలిసిన సంగతే. మైదుకూరు రాజకీయం కూడా అదేనని..లోకేష్ ఆశీస్సులతో పుట్టా సుధాకర్ యాదవ్ కు టికెట్ దక్కిందని అంటున్నారు.

సుధాకర్ యాదవ్ గెలుస్తారా? అంటే.. డబ్బులు ఉన్నాయి కానీ.. గెలుపు కష్టమని స్థానికులు అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి మరో ఝలక్ తగిలింది. తనే తెలుగుదేశం పార్టీలోకి చేరే ఉద్ధేశంతో వర్తమానం పంపిన డీఎల్ రవీంద్రా రెడ్డి.. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఖరారు అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు.

మైదుకూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి ఆర్థికంగా గట్టిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో జగన్ పార్టీ అలర్ట్ అయ్యింది. డీఎల్ రవీంద్రా రెడ్డిని కూడా ఇటువైపుకు తెచ్చేసుకుంది. ఎన్నికల ముందు ఒక చేరిక ప్రభావం ఎంత అనేది పక్కన పెడితే.. ఇది అదనపు బలం అవుతుందని మాత్రం విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.