Begin typing your search above and press return to search.

జీఎస్ టీ బిల్లులో బీజేపీ..కాంగ్రెస్ మధ్య లొల్లి?

By:  Tupaki Desk   |   28 Nov 2015 6:43 AM GMT
జీఎస్ టీ బిల్లులో బీజేపీ..కాంగ్రెస్ మధ్య లొల్లి?
X
కేంద్రానికి కంటి నిండా కనుకు లేకుండా చేస్తున్న విషయాల్లో మొదటిది.. ముఖ్యమైనది వస్తు.. సేవల పన్ను బిల్లు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ శీతాకాల సమావేశాల్లో ఆమోదించాలన్న పట్టుదలతో మోడీ సర్కారు ఉంది. ఈ బిల్లు కానీ ఆమోదం పొంది.. చట్టం కాని పక్షంలో పాలనా పరంగా మోడీ సర్కారు చేపట్టాలనుకున్న చాలానే మార్పులు ఆగిపోయే పరిస్థితి. అందుకే.. 18 నెలలుగా పట్టించుకోని కాంగ్రెస్ అధినేత్రి సోనియాను తాజాగా ఇంటికి తేనీటి విందుకు ఆహ్వానించారని చెప్పొచ్చు.

అయితే.. ఈ వస్తు సేవల పన్ను బిల్లులో మూడు అంశాలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనికి బీజేపీ ససేమిరా అంటోంది. ఈ మూడు అంశాల విషయంలో కాంగ్రెస్ అభ్యంతరాలు ఏమిటి? దానికి బీజేపీ మాటేమిటన్నది కీలకంగా మారింది. మరి.. ఈ మూడు అంశాల విషయాన్ని చూస్తే. మొదటి అంశం ఏమిటి? వస్తు సేవల పన్ను మీద పరిమితి విధించాలా? వద్దా? కాంగ్రెస్ వాదన వస్తుసేవల పన్ను పరిమితిని 18 శాతానికి మించకూడదు. బిల్లులో ఇప్పుడు కానీ 18 శాతం అన్న పరిమితి పెట్టని పక్షంలో రేపొద్దున్న ప్రభుత్వాలు ఈ పన్నును ఏ పాతిక శాతమో.. 40 శాతమో చేస్తే దేశ ప్రజల మీద విపరీతమైన భారం పడుతుంది. అందుకే.. ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తుసేవల పన్ను మీద పరిమితిని 18 శాతానికి మించదని బిల్లులో స్పష్టంగా పేర్కొనాలి. బీజేపీ వాదన వస్తుసేవల పన్నుపరిమితి ఇంత అన్నది నిర్దేశించటం అనవసరం. అవసరానికి అనుగుణంగా పన్ను పరిమితిని మార్చుకునే స్వేచ్ఛ ప్రభుత్వాలకు ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో పన్నును కాస్త పెంచాలన్న కష్టమవుతుంది. అందుకే.. సేవల పన్ను పరిమితిని ఫలానా సంఖ్యకు పరిమితం చేయకూడదు.

రెండో అంశం ఏమిటి? తయారీ పరిశ్రమలున్న రాష్ట్రాలు అదనంగా విధించే ఒక శాతం సుంకం రద్దు చేయాలి కాంగ్రెస్ వాదన వస్తుసేవల పన్ను ఇప్పటికే 18 శాతం అవుతున్నందున తయారీ పరిశ్రమలు ఉన్న రాష్ట్రాలు అదనంగా మరో శాతం పెంచటం ప్రజల మీద భారం పెంచినట్లు అవుతుంది. అందుకే.. ఇంక ఎలాంటి సుంకాలు ఉండకూడదు. బీజేపీ వాదన రాష్ట్ర ప్రభుత్వాల ప్రయోజనాలు.. ఆదాయాన్ని ప్రభావితం చేసే అంశం. దీనిపై ఆదాయం వచ్చే ఆయా రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసే వీలుంది. అందుకే.. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. మూడో అంశం ఏమిటి? ఈ వస్తుసేవల పన్ను అంశానికి సంబంధించి వివాదాల పరిష్కారానికి ఒక స్వతంత్ర్య వ్యవస్థ అవసరమా? కాంగ్రెస్ వాదన ఏదైనా వివాదం వస్తే.. అది కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చేయటం కారణంగా ఇబ్బందులు తలెత్తే వీలుంది. అందుకే.. రాజకీయాలకు అతీతంగా ఒక స్వతంత్ర్య వ్యవస్థ వివాదాల్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేయాలి. బీజేపీ వాదన వివాదాల పరిష్కారానికి ఒక స్వతంత్ర్య వ్యవస్థ అనవసరం. దీని వల్ల లేనిపోని తలనొప్పులు ఖాయం. వివాద పరిష్కారానికి కేంద్ర.. రాష్ట్రాలు సరిపోతాయి.