Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డి దూకుడుకు కాంగ్రెస్ తొలి బ్రేక్‌

By:  Tupaki Desk   |   26 Sep 2018 7:51 AM GMT
కోమ‌టిరెడ్డి దూకుడుకు కాంగ్రెస్ తొలి బ్రేక్‌
X
కాంగ్రెస్ పార్టీలో డైన‌మిక్ లీడ‌ర్లుగా గుర్తింపు పొందిన కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ కు తొలిషాక్ ఎదురుకానుంందా? వారి దూకుడుకు బ్రేకులు వేసేలా అధిస్టానం పరోక్షంగా నిర్ణ‌యం తీసుకోనుందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇటీవల కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జి రామచంద్ర కుంతియా - టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై వివరణ సందర్భంగా ఆయన వారిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై ఆయన రాతపూర్వకంగా క్రమశిక్షణ సంఘానికి లేఖ రాసినట్టు తెలిసింది. అయితే రాజగోపాల్‌ రెడ్డి వివరణపై - ఆయన రాసిన లేఖపైన సంతృప్తి చెందని సంఘం మళ్లీ నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ ట్విస్ట్ ఇక్క‌డితో ముగిసిపోలేదు. రాజ‌గోపాల్ రెడ్డి అసంతృప్తి ఆయ‌న సీటుకు ఎస‌రుపెట్టిన‌ట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌-టీడీపీ-సీపీఐ-టీజేఎస్ పార్టీలు మ‌హాకూట‌మి పేరుతో పొత్తు పెట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా మునుగోడు సీటు సీపీఐకి కేటాయించే అవకాశం ఉండటంతో రాజగోపాల్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తనను పోటీ చేయకుండా పార్టీ అడ్డుకుంటుందని ఆయన తన సహయక అనుచరుల వద్ద వాపోయినట్టు సమాచారం. దీనికి ఆయన సమాధానం ఇస్తారో - లేదో కానీ రెండోసారి నోటీసులు ఇవ్వడం పట్ల మాత్రం ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు ఢిల్లీలో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ కు వ్య‌తిరేకంగా వేగంగా ప‌రిణామాలు క‌దులుతున్నాయి. మ‌హాకూటమి పొత్తులు - పార్టీ పోటీ చేయాలనుకుంటున్న స్థానాలపై చర్చ - కోమటిరెడ్డి అంశంపై చర్చించేందుకు ఢిల్లీ రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నుంచి పార్టీ రాష్ట్ర నేత‌ల‌కు పిలుపు వచ్చింది. దీంతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - సీనియర్ నేత జానారెడ్డి మంగళవారం ఢిల్లీవెళ్లారు. మంగళవారం రాత్రి రాహుల్‌ గాంధీతో వార్‌ రూంలో భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అధినేత సూచన మేరకు క్రమశిక్షణా సంఘం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నదని పలువురు సీనియర్ నేతలు భావిస్తున్నారు.

మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పోటీ చేయడానికి సన్నద్ధమవడం - పార్టీ నేతలను టార్గెట్ చేసి రచ్చకెక్కడం వంటి చర్యలతో విసిగిపోయిన రాష్ట్ర నాయకత్వం మునుగోడును కూటమికి వదిలేసేందుకు సిద్ధమవుతున్నట్టు - ఈ మేరకు రాహుల్‌ గాంధీని చూచాయగా ఒప్పించినట్టు సమాచారం. త‌ద్వారా కోమ‌టిరెడ్డి దూకుడుకు ఆదిలోనే బ్రేకులు వేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, త‌నపై సప్పెన్షన్‌ వేటు వేస్తే మునుగోడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రెడీ అవుతున్న‌ట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.