Begin typing your search above and press return to search.

కర్నాటకలో బీజేపీకి షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ

By:  Tupaki Desk   |   21 May 2018 7:24 AM GMT
కర్నాటకలో బీజేపీకి షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ
X
కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్-జేడీఎస్ గెలిచింది. గడిచిన గోవా ఎన్నికల్లో లేటుగా స్పందించి అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటక ఎన్నికల విషయంలో మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఏకంగా సోనియానే రంగంలోకి దిగి.. కాంగ్రెస్ సీనియర్లను కర్ణాటకలో వాల్చింది. ఎన్నికల్లో బీజేపీకి 104 సీట్లకే పరిమితం కావడంతో ఎలాగైనా బేరసారాలకు దిగవచ్చని తెలిసి కాంగ్రెస్-జేడీఎస్ లు తమ ఎమ్మెల్యేలతో క్యాంపులకు సిద్ధమయ్యాయి. కొచ్చి తర్వాత హైదరాబాద్ లోని హోటల్లలో ఎమ్మెల్యేలను దాచేశారు..

అయితే బీజేపీ తరఫున ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఏకంగా సీఎం అభ్యర్థి యడ్యూరప్ప - గాలి జనార్ధన్ రెడ్డి - శ్రీరాములు - బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుతో పాటు మధ్యవర్తులు తీవ్ర ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన కాంగ్రెస్ పెద్దలు క్యాంపుల్లో ఉన్న ఎమ్మెల్యేల దగ్గరున్న సెల్ ఫోన్లను లాక్కోలేదు. అందరి ఫోన్లలో కాల్ రికార్డ్ ఆప్షన్ ను ఆన్ చేయించారు. దీంతో యడ్యూరప్ప సహా బీజేపీ నాయకులంతా కాంగ్రెస్ వలలో పడిపోయారు. కాల్ రికార్డింగ్ సంగతి తెలియని బీజేపీ నేతలంతా ఇప్పుడు బుక్ అయిపోయారు. మొన్నటివరకు శ్రీరాములు, యడ్యూరప్ప, గాలి జనార్ధన్ రెడ్డి, యడ్యూరప్ప కుమారుడి ఆరు ఆడియోలను మాత్రమే రిలీజ్ చేసి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్నీ మీడియాకు రిలీజ్ చేసి బీజేపీ నేతలను జైలుకు పంపించేందుకు రెడీ అయ్యింది.

కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలకు చెందిన 40మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసిన బీజేపీ నాయకులు తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. లెక్కకు మిక్కిలి హామీలు ఇచ్చారు. మంత్రి పదవులు, 100 కోట్ల వరకూ ఆశ చూపించారు. ఇప్పుడీ మాటలన్నింటిని రికార్డు చేయించిన కాంగ్రెస్ నేతలు ఆ ఫోన్లోని ఆడియో క్లిప్పింగ్ లను కోర్టులో సబ్ మిట్ చేసి సదురు బీజేపీ నేతలను జైలుకు పంపించేందుకు రెడీ అయ్యారట.. దేశం మొత్తం తెలిసేలా ఆ ఆడియోలను రిలీజ్ చేసి బీజేపీ అనైతిక చర్యలను బయటపెట్టడానికి రెడీ అయ్యారట.. దీంతో ప్రధానంగా ఫోన్లు చేసిన యడ్యూరప్ప, ఆయన కుమారుడు, మురళీధర్ రావు, బళ్లారి శ్రీరాములు, గాలి జనార్ధన్ రెడ్డిలు త్వరలోనే ఊచలు లెక్కబెట్టేందుకు రెడీ కాబోతున్నారని సమాచారం. దీంతో పాటు దేశవ్యాప్తంగా బీజేపీ పరువు గంగలో కలిపేందుకు కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది.