Begin typing your search above and press return to search.

గురి చూసి కొడతామంటున్న కాంగ్రెస్!!

By:  Tupaki Desk   |   19 Oct 2018 8:18 AM GMT
గురి చూసి కొడతామంటున్న కాంగ్రెస్!!
X
ఎన్నికల వేళ గెలుపు కోసం అవసరమైన అన్ని దారులను వెతుకుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్రం. ఇందుకోసం ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం అన్ని పార్టీలను కుదిపేసింది. ముఖ్యంగా ఆ ప్రభావం ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పైనే పడింది. సోనియా గాంధీ వల్లే ఇది సాధ్యమైందనే ప్రచారాన్ని కూడగట్టుకోవడంలో ఆ పార్టీ నేతలు ఒకింత విజయం సాధించారు.

విభజన తరువాత కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చారన్నది కాంగ్రెస్ నేతల వాదన. కానీ, తెలంగాణ ఇచ్చింది మాత్రం కాంగ్రెస్సే అన్న విషయాన్ని ప్రజలు ప్రజలు గ్రహించాలని అంటున్నారు. ఆ మేరకు టీఆర్ ఎస్ గత ఎన్నికల్లో పండించిన సెంటిమెంట్ ను ఈ సారీ బయటకు తీసుకువస్తుంది. కాంగ్రెస్ కూడా తెలంగాణ సెంటిమెంట్ బాటనే పడుతున్నట్లుంది.

రాహుల్ గాంధీ కన్నా - సోనియా గాంధీపైనే కొంత సానుకూల దృక్పథం తెలంగాణ ప్రజల్లో ఉందని కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు. ఈ క్రమంలో సోనియాను ఎన్నికల ప్రచారంలోకి దింపితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఈ నెల చివరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందోనని లాభనష్టాలు బేరీజు వేసుకుంటున్నారు. టీఆర్ ఎస్ ను దెబ్బకొట్టేందుకు సోనియా గాంధీ సరైన అస్ర్తమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

భారీ బహిరంగ సభ లేదా ఎన్నికల చివరిలో తెలంగాణ మొత్తం సోనియా గాంధీ ద్వారా ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు ప్రణాళిక రచిస్తున్నారు. సోనియా గాంధీ ప్రచారం ఖచ్చితంగా పనిచేస్తుందని, టీఆర్ ఎస్ కు భారీగా దెబ్బతీయం ఖాయమని చెబుతున్నారు. టీఆర్ ఎస్ కూడా సోనియా గాంధీని విమర్శించడంలో తటపటాయిస్తుందని - ఇది తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఒక వేళ సోనియా అనే అస్త్రం పని చేస్తే టీఆర్ ఎస్ ఆశలు గల్లంతవడం ఖాయమనే తెలుస్తుంది.