Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ల‌ను ఓడించింది కాంగ్రెస్సే పార్టీయే క‌దా?

By:  Tupaki Desk   |   12 Dec 2018 4:31 AM GMT
సీనియ‌ర్ల‌ను ఓడించింది కాంగ్రెస్సే పార్టీయే క‌దా?
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. మా నియోజకవర్గాలకు మేమే కర్త - కర్మ - క్రియ అని బాకాలూదుకునే నాయకులను ప్రజలు ఇంటికి పంపించారు. ఇందులో ప్ర‌ధానంగా - కాంగ్రెస్ పార్టీ కురువృద్ధులు - ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రచారం చేసుకున్నవారు - సీనియర్ నేతలనుకున్న హేమాహేమీలు అందరూ ఓడిపోయారు. ఆయా నియోజకవర్గాలు మీ ఇలాకాలు కావు.. మీ సొంత ఆస్తులు కావని ప్రజలు తేల్చిచెప్పారు. మీరు ఎంతపెద్ద నాయకులైనా కావచ్చు - గెలిస్తే సీఎంలు కావచ్చేమోకానీ - మేం మెచ్చిన నాయకులు మీరుకాదని ప్రజలు తీర్పు ఇచ్చారు. ముఖ్య‌నేత‌లు - మ‌హామ‌హులు అనుకున్న వారంతా మ‌ట్టిక‌రిచారు.

సీఎం రేసులో ఉన్న మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య - గీతారెడ్డి - డీకే అరుణ - షబ్బీర్ అలీ - నాగం జనార్దనరెడ్డిని ఆయా నియోజకవర్గ ప్రజలు తిరస్కరించారు. ఇదే తీరుగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ - సీనియర్ నేత - తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని చెప్పకున్న సర్వే సత్యనారాయణ - సీనియర్ కాంగ్రెస్ నాయకుడు టీ జీవన్‌ రెడ్డి - సబితా ఇంద్రారెడ్డిని ప్రజలు ఇంటికి పంపించారు. ఇదే దారిలో సీనియర్ నేతలు - ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి - కొండా సురేఖ - మల్లురవి - జీ చిన్నారెడ్డి - మల్లు భట్టివిక్రమార్క - బీసీ నేత ఆర్ కృష్ణయ్య - పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సతీమణి పద్మావతిరెడ్డి - దాసోజు శ్రవణ్‌ కుమార్ - సంపత్‌ కుమార్‌ ను ప్రజలు తిరస్కరించారు.

కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు నాయకుడిని తానేనని.. రాబోయేరోజుల్లో పార్టీ తన చేతుల్లో నుంచే నడుస్తుందని అనుచరుల వద్ద చెప్పుకునే రేవంత్‌ రెడ్డికి కొడంగల్ ప్రజలు షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రినని చెప్పుకునే కుందూరు జానారెడ్డిని సొంత నియోజకవర్గ ప్రజలు ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్నారు. మాకేమిచేశావని ఇప్పుడొచ్చి ఓట్లడుగుతున్నావని కడిగిపారేశారు. దీంతో ప్రజలు ఓడిస్తారన్న భయంతో జానారెడ్డి నియోజకవర్గానికే పరిమితమై ప్రచారం చేశారు. ప్రచారం చివరిదశలో ఈ దఫా తాను గెలిస్తే సీఎం అవుతానని - తన చిరకాల కోరిక తీరుతుందని జానారెడ్డి ప్రజలను కోరుకున్నా హైదరాబాద్‌ కు పరిమితమయ్యారు..? మమ్ముల్ని పట్టించుకోలేదు కానీ నీ కోరికను మేం తీర్చాలా? అదెలా సాధ్యమవుతుందని ప్రజలు తిరస్కరించారు.