Begin typing your search above and press return to search.

ప్ర‌ణ‌బ్ కు పొగ‌బెడుతోన్న కాంగ్రెస్?

By:  Tupaki Desk   |   11 Jun 2018 10:47 AM GMT
ప్ర‌ణ‌బ్ కు పొగ‌బెడుతోన్న కాంగ్రెస్?
X
2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జీని ఆరెస్సెస్‌ ప్రకటించే అవకాశముందని శివసేన నేత సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆరెస్సెస్‌ సదస్సులో ప్ర‌ణ‌బ్ పాల్గొని.. జాతీయవాదం, దేశభక్తి గురించి ప్రసంగించ‌డం తీవ్ర చ‌ర్చనీయాంశ‌మైంది. ప్ర‌ధాని కావాల‌న్న త‌న చిరకాల కోరికను ప్రణబ్‌ తీర్చుకోనున్నారని వ‌దంతులు వినిపిస్తునన్నాయి. దీంతో, సంజ‌య్ వ్యాఖ్య‌ల‌ను దాదా కుమార్తె శర్మిష్ట ముఖర్జీ ఖండించారు. రాష్ట్రపతిగా రిటైరైన తర్వాత ప్ర‌ణ‌బ్ రాజకీయాల్లోకి తిరిగి వచ్చే అవకాశమే లేద‌ని ఆమె ట్వీట్‌ చేశారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ణ‌బ్ కు కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. ఈ నెల 13న ఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌ హోటల్ లో నిర్వహించనున్న ఇఫ్తార్‌ విందుకు ప్రణబ్ కు ఆహ్వానం పంప‌కుండా దూరం పెట్టింది. ఆరెస్సెస్ స‌భ‌కు ప్ర‌ణ‌బ్ వెళ్ల‌డంపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం...ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీని మ‌ట్టి క‌రిపించి ఎన్టీఏ కూట‌మి అధికారంలోకి రాకుండా చేయాల‌ని కాంగ్రెస్ స‌న్నాహాలు చేస్తోంది. అందుకోసం, దేశంలోని బీజేపీ వ్య‌తిరేక పార్టీల‌ను - ప్రాంతీయ పార్టీల‌ను ఏకం చేసేందుకు సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలోనే ఈ కీలక ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేసింది. తమకు అనుకూల పార్టీల అధినేత‌ల‌కు ఇఫ్తార్‌ విందు ఆహ్వానాలు పంపింది. ఒక‌వేళ‌ - ఆ పార్టీల అధ్యక్షులు హాజరుకాని పక్షంలో ఇతర కీలక నేతలను పంపాలని కూడా కోరింది. అయితే - అనూహ్యంగా ఆ విందుకు ప్రణబ్ తో పాటు ఆప్‌ కన్వినర్‌ - ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ - మాజీ రాష్ట్రపతి హమీద్‌ అన్సారీలకు ఆహ్వానాలు పంప‌లేదు. మోదీపై ఒంటికాలిమీద లేచే కేజ్రీని ఆహ్వానించ‌కపోవడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎన్డీఏ వ్య‌తిరేక పార్టీల‌న్నింటినీ ఒక చోట చేర్చేందుకు ఈ ఇఫ్తార్ విందును వాడుకోవాల‌నుకుంటోన్న కాంగ్రెస్....వారిని దూరం పెట్ట‌డం పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తుంటే....ప్ర‌ణ‌బ్ కు కాంగ్రెస్ అధిష్టానం పొమ్మ‌న‌లేక పొగబెడుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రి, ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌ణ‌బ్ స్పందన ఏవిధంగా ఉంటుందో ఆస‌క్తిక‌రంగా మారింది.