Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేను తరిమికొట్టిన జనాలు.?

By:  Tupaki Desk   |   17 July 2018 9:28 AM GMT
ఎమ్మెల్యేను తరిమికొట్టిన జనాలు.?
X
దేశవ్యాప్తంగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేను తరిమికొడుతున్న జనాలు అంటూ అందరూ తెగ షేర్లు చేస్తున్నారు.. ఆ వీడియోలో ఉన్నది రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా ప్రాంతానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే శంకర్ లాల్ శర్మ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఎందుకు ఆ ఎమ్మెల్యేను పరిగెత్తించి కొట్టారు..? ఏంటా కథ అని ఆరా తీయగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

జూలై 13నుంచి వైరల్ అవుతున్న వీడియోను ఇప్పటికే వేలమంది చూశారు. అయితే ఆ వీడియోలో తెల్లటి కుర్తా వేసుకొని పరిగెడుతున్నది దౌసా ప్రాంతానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే కాదని తాజాగా నిర్ణారణ అయ్యింది. వీడియోలో ప్రజలు తరుముతున్న వ్యక్తి రాజస్థాన్ లోని గంగాపూర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రంకేష్ మీనా అని తేలింది. ఈ వీడియోను భారత్ బంద్ సందర్భంగా తీశారట.. సుప్రీం కోర్టు ఎస్సీ - ఎస్టీ వేధింపుల నిరోధకచట్టానికి వ్యతిరేకంగా తీర్పునివ్వడంతో చెలరేగిన అల్లర్లప్పుడు తీసిన వీడియో ఇది.

ఈ వీడియోలో ఉన్నది తానేనని ప్రచారం చేయడంపై దౌసా బీజేపీ ఎమ్మెల్యే శంకర్ లాల్ స్పందించారు. ‘నా పేరుతో ప్రచారం అవుతున్న వీడియోలో ఉన్నది తాను కాదు.. ఎవరో నకిలీ వీడియోలను తయారు చేసి ప్రచారం చేస్తున్నారని’ తెలిపారు. ఆ వీడియోలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కి చెందిన మాజీ ఎమ్మెల్యే రంకేష్ మీనా అని. నకిలీ వీడియో చేసి పరువు తీస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ ఆఫీసు ఎదుట నిరసన తెలుపుతాం’ అని శంకర్ లాల్ స్పష్టం చేశారు. అయితే ఆ వీడియోలో ఉన్న అసలు వ్యక్తి మాజీ ఎమ్మెల్యే రంకేష్ మీనా మాత్రం దీనిపై స్పందించాలని కోరగా.. ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.