Begin typing your search above and press return to search.

కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా కొత్త అస్త్రం

By:  Tupaki Desk   |   8 Feb 2016 9:37 AM GMT
కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా కొత్త అస్త్రం
X
గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ దుమ్మురేపే విజ‌యం రాజ‌కీయ‌వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే వివిధ విశ్లేష‌ణ‌ల‌కు బీజం వేస్తోంది. బ‌ల్దియా ఫ‌లితాల్లో ఘోర ఓటమి చవిచూసిన ప్ర‌తిప‌క్ష పార్టీలైన టీడీపీ - బీజేపీ - కాంగ్రెస్‌ ల‌పై తెగ సానుభూతి వ్య‌క్తం అవుతోంది. ఈ నేప‌థ్యంలో ఆయా పార్టీలు సైతం ఓట‌మిని స‌మీక్షించుకుంటున్నాయి. అంతేకాకుండా టీఆర్ ఎస్ విజ‌యాన్ని కూడా విశ్లేషిస్తున్నాయి. తాజాగా ఘోర ప‌రాజ‌యం పాలైన పార్టీలో లిస్ట్‌ లో ప్ర‌ముఖంగా క‌నిపించే కాంగ్రెస్‌ పార్టీ త‌న అన్వేష‌ణ‌లో కొత్త‌ అంశాన్ని తెర‌మీద‌కు తెచ్చింది.

ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు నేతృత్వంలోని ప్ర‌భుత్వం ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేశార‌ని కాంగ్రెస్ బ‌లంగా ఆరోపిస్తోంది. ఈ క్ర‌మంలో ప‌లు సంఘట‌న‌ల‌ను సైతం కాంగ్రెస్ నేత‌లు ఉద‌హ‌రించారు. అయితే త‌మ ఓట‌మిని కేవ‌లం ఆరోప‌ణ‌ల స్థాయికే వదిలిపెట్ట‌కుండా న్యాయపోరాటం చేయ‌డానికి తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమైంది. ఎన్నికల్లో ఈవీఎంలు టాంపరింగ్‌ చేశారని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత‌లు ఫిర్యాదు చేయనున్నారు. అందులో భాగంగా తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు తాజాగా ఢిల్లీ వెళ్లారు. ఒక్కో బూత్‌ లో అభ్య‌ర్థుల కుటుంబ స‌భ్యుల ఓట్లు కూడా ప‌డ‌క‌పోవ‌డం, అస‌లు ఓట్ల‌కంటే పోలైన ఓట్లు ఎక్కువ‌గా ఉండ‌టం వంటి అంశాలను సీఈసీ వ‌ద్ద ప్రముఖంగా ప్ర‌స్తావించ‌నున్న‌ట్లు కాంగ్రెస్ నేత‌లు చెప్తున్నారు.

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో రాజ్యాంగబ‌ద్దమైన సంస్థ అయిన కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌డంతోనే త‌మ పోరాటం ఆప‌బోమ‌ని కాంగ్రెస్ నేత‌లు ఘంటా ప‌థంగా చెప్తున్నారు. త‌మ ఫిర్యాదుతో సీఈసీ వేసే అడుగులను బ‌ట్టి త‌దుప‌రి చ‌ర్య‌లు ఉంటాయ‌ని చెప్పారు. అవ‌స‌రమైతే గ్రేటర్‌ ఎన్నికలపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయనున్నట్లు పార్టీ నేత‌లు వివ‌రిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ ముఖ్య‌మంత్రికి వ్య‌తిరేకంగా కొత్త అస్త్రాల‌తో కాంగ్రెస్ దూకుడుగానే ముందుకువెళుతోంది.