Begin typing your search above and press return to search.

అవునా..ఈవీఎంలు ట్యాంపరింగా..మీరు సూపర్

By:  Tupaki Desk   |   13 Dec 2018 5:36 PM GMT
అవునా..ఈవీఎంలు ట్యాంపరింగా..మీరు సూపర్
X
తెలంగాణ కాంగ్రెస్ సూపర్ నాయకులు అనిపించుకుంటున్నారు. ఓటమి వారిని చాలా గొప్ప నాయకులుగా మార్చిందని అంటున్నారు. అంతేనా.... మనుషులనే కాదు... యంత్రాల పని తీరు కూడా ఎలా ఉంటుందో చెప్పే స్థితిలోకి తెలంగాణ కాంగ్రెస్ నాయకుల వెళ్లారని నెటిజన్లు వారికి సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో డాక్టరేట్లు... అవార్డులు పొందిన వారు కూడా తేల్చలేని ఈవిఎంల విధాన్నాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పు పట్టడం వారి మేథోతనానికి మచ్చుతునక అంటున్నారు. ఇంతకీ ఇదంతా ఏమిటి అనుకుంటున్నారా.... అవును తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈవీఎంల పనితీరుపై చేసిన విమర్శలు వారి టెక్నాలజీ స్ధాయి ఏపాటిదో తెలియజేస్తున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల తర్వాత బోసి పోయిన గాంధీభవన్‌ కాంగ్రెస్‌ నేతలు సంపత్‌ కుమార్‌ - దాసోజు శ్రవణ్‌ - అద్దంకి దయాకర్‌ లు గురువారం మీడియాతో మాట్లాడారు. ఇంతేనా... అంటే ఇంకా చాలా ఉంది.... కేటీఆర్‌ కు లై డిటెక్టర్‌ టెస్ట్‌ నిర్వహించాలని - ఈవీఎం ట్యాంపరింగ్‌ పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఓటమి వల్ల కలిగిన భయం వల్ల వచ్చిన... సందేహాలతో కూడిన.... ఏం చేయాలో పాలుపోని స్థితిలో చేసిన ప్రకటనలుగానే దీన్ని పరిగణిస్తున్నారు రాజకీయ పండితులు.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు పొంతన లేకుండా ఉన్నాయని - తాను పోలింగ్ సరళిని దగ్గరుండి గమనించానని చెబుతున్నారు కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్. ఇదే తెలంగాణ ప్రజలకు అర్ధం కాని విషయమని అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణలో 119 స్ధానాల్లో ఎన్నికలు జరిగితే ఒకే ఒక్కడు సంపత్ కుమార్ అన్ని నియోజకవర్గాల్లో స్వయంగా ఎలా పరిశీలన చేశారని ప్రశ్నిస్తున్నారు. ద్వాపర యుగంలో శ్రీక్రిష్ణుడు మాత్రమే తన అష్ట భార్యలతో ఒకేసారి ఉన్నట్లుగా పురాణాలు చెబుతున్నాయని - మరి ఈ సంపత్ కుమార్ క్రిష్ణుడి కంటే గొప్పవాడని అనుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు రాజకీయ నాయకులపైనే విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నాయకులు ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం అధికారులపై కూడా విమర్శలు సంధించారు. ఏకంగా ఎన్నికల సంఘం అధికారులు రజత్‌ కుమార్‌ కు సైతం లై డిటెక్టర్ టెస్ట్ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అనుమానాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన హిందీ బెల్టు రాష్ట్రాల్లో రాలేదా అని అడుగుతున్నారు. ఇది నిజమే కదా...అక్కడ ఈవీఎం కారణంగా విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం ఓడిపోవడానికి ఈవీఎంలు ఎందుకు కారణమో కాంగ్రెస్ నాయకులే చెప్పాలనే డిమాండ్ వస్తోంది. మరీ దీనికి సమాధానం చెబుతారా కాంగ్రెస్ నాయకులూ అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.