Begin typing your search above and press return to search.

ప్రభుత్వ అధికారిపై పెట్రోల్ పోసిన కాంగ్రెస్ లీడర్

By:  Tupaki Desk   |   20 Feb 2018 4:10 PM GMT
ప్రభుత్వ అధికారిపై పెట్రోల్ పోసిన కాంగ్రెస్ లీడర్
X
వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని నమ్మకంగా ఉన్నారో.. లేదంటే ఎలాగూ ఓడిపోతాం కాబట్టి ఇప్పుడే తమ జులుం అంతా చూపించాలని అనుకుంటున్నారో ఏమో కానీ కర్ణాటక కాంగ్రెస్ నేతలు మాత్రం రోజుకో వివాదం సృష్టిస్తున్నారు. తమ రౌడీయిజాన్ని జనం మీద చూపిస్తున్నారు. దీంతో ఎన్నికల వేళ ఇది మరింత నష్టం కలిగించడం ఖాయమని ఆ పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్‌ నేతలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఓ ఎమ్మెల్యే కుమారుడు పబ్‌ లో ఓ వ్యక్తిపై దాడి చేసి పరారవగా... తాజాగా మరో కాంగ్రెస్‌ నేత ఏకంగా పెట్రోల్‌ సీసా పట్టుకుని ప్రభుత్వ కార్యాలయం తగలబెట్టడానికి రెడీ అయ్యాడు. కేఆర్‌ పురం బ్లాక్‌ మాజీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నారాయణస్వామి ఇటీవల హోరమావులోని బృహత్‌ బెంగళూరు మహానగర పాలిక వార్డ్‌ కార్యాలయంలో పెట్రోల్‌ బాటిల్‌తో అందరినీ భయపెట్టాడు. కేఆర్‌పురం ఎమ్మెల్యే బైరతి బసవరాజ్‌ ప్రధాన అనుచరుడైన నారాయణస్వామి వార్డ్‌ కార్యాలయంలో పెట్రోల్‌ చల్లి తగులబెడతానని హెచ్చరించాడు. హెచ్చరించడమే కాదు కార్యాలయంలో ఉన్న రెవెన్యూ అధికారిపై పెట్రోలు పోశాడు.

స్థానికంగా ఒక భూవివాదంలో ఉన్న ఆయన అందుకు సంబంధించిన పత్రాలపై తనకు అనుకూలంగా సంతకాలు చేయించేందుకు అదికారులను బెదిరించాడు. వారు లొంగకపోవడంతో ఏకంగా పెట్రోలు పోశాడు. కొద్దిరోజుల కిందట జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఈ రోజు బయటకు రావడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ నాయకుల తీరుతో నష్టం తప్పదని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయట.