Begin typing your search above and press return to search.

హరీశ్‌ రావు ఆప‌రేష‌న్‌..కాంగ్రెస్ మైండ్ బ్లాంక్‌

By:  Tupaki Desk   |   18 Nov 2018 4:26 PM GMT
హరీశ్‌ రావు ఆప‌రేష‌న్‌..కాంగ్రెస్ మైండ్ బ్లాంక్‌
X
తెలంగాణ‌లో అప‌ద్ధ‌ర్మ స‌ర్కారుకు సార‌థ్యం వ‌హిస్తున్న టీఆర్ ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎత్తుగ‌డ‌లు వేస్తుంటే..ఆ పార్టీకే రివ‌ర్స్ పంచ్ ఎదుర‌వుతోందని రాజ‌కీయ‌వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. ఒక‌దాని వెంట ఒక‌టి అన్న‌ట్లుగా ఆ పార్టీలో ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే టికెట్ల కేటాయింపులో ప‌లువురు నేత‌లు భ‌గ్గుమంటుండగా తాజాగా మ‌రో నేత గుడ్‌ బై చెప్పేశారు. కాంగ్రెస్ అసంతృఫ్తిని క్యాష్‌ చేసి మంత్రి హ‌రీశ్‌ రావు చేసిన మంత్రాంగం ఫ‌లితంగా ఈ చేరిక‌లు జ‌రిగాయి. ఆయ‌న ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాకకు చెందిన సీనియర్‌ నేత - మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి.

మహాకూటమి పొత్తుల్లో భాగంగా దుబ్బాక స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ టీజేఎస్‌ కు కేటాయించింది. దీంతో ముత్యం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ కు గుడ్ బై చెప్పారు. ఎల్లుండి(20వ తేదీ) కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ ఎస్‌ లో చేరనున్నారు. టీఆర్ ఎస్ నేతలు హరీష్‌‌ రావు - సోలిపేట రామలింగారెడ్డిలు ఆదివారం(18వ తేదీ) చెరుకు ముత్యం రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. తమ పార్టీలోకి ఆహ్వానించేందుకే ముత్యం రెడ్డి ఇంటికి వచ్చామని హరీష్ తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ తనను మోసం చేసిందని వారి ముందు ముత్యం రెడ్డి కంటతడి పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో మంచివారికి స్థానం లేదని ముత్యం రెడ్డి వాపోయారు. తన వద్ద డబ్బు లేకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ తనకు టికెట్‌ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఈ సందర్భంగా ముత్యం రెడ్డిని హరీష్ ఓదార్చారు. దుబ్బాక అభివృద్ది వెనుక ముత్యం రెడ్డి - రామలింగారెడ్డి శ్రమ ఎంతో ఉందని చెప్పారు. సిద్ధిపేట తరహాలో దుబ్బాకను వారిద్దరు అభివృద్ధి చేశారని హరీష్ చెప్పారు. ముత్యం రెడ్డి చేరికతో మెదక్‌ జిల్లాలో టీఆర్‌ ఎస్‌ బలం మరింత పెరిగిందని అన్నారు. ఈ నెల 20న సిద్దిపేటలో జరిగే సభలో కేసీఆర్‌ సమక్షంలో ముత్యం రెడ్డి టీఆర్‌ ఎస్‌‌ లో చేరుతున్నట్లు హరీష్ ప్రకటించారు.