Begin typing your search above and press return to search.

మర్రికి మొండి 'చెయ్యి'..ఢిల్లీ రమ్మని పిలుపు

By:  Tupaki Desk   |   18 Nov 2018 5:32 AM GMT
మర్రికి మొండి చెయ్యి..ఢిల్లీ రమ్మని పిలుపు
X
ఇదీ కాంగ్రెస్ పార్టీ అంటే. వందేళ్లకు పైబడిన చరిత్ర ఉన్న ఈ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో నాయకులు - కార్యకర్తలకే కాదు పార్టీ జాతీయాధ్యక్షుడికి కూడా తెలియదు. సీల్డ్ కవర్స్ సీఎం అంటూ పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీలో అందరూ ముఖ్యమంత్రులే. అందరూ సీనియర్లే. అందరూ టిక్కెట్ల కోసం లైన్లో నిలబడాల్సిన కార్యకర్తలే. మాజీ ముఖ్యమంత్రి - మాజీ గవర్నర్ వంటి పదవులను పొందిన మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డికి సనత్‌ నగర్ టిక్కెట్టు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపించింది.

కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి స్దాయి అభ్యర్దులలో మర్రి శశిధర్ రెడ్డి కూడా ఒకరు. రాజకీయ కుటుంబమైన మర్రి శశిధర్ రెడ్డి పార్టీలో అత్యంత సినీయర్ నాయకుడు. ఆయనకు టిక్కెట్టు రాదని నియోజకవర్గ ప్రజలు కూడా ఊహించరు. గెలుపోటములు ప‌క్కన పెడితే సనత్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్దిగా మర్రి శశిధర్ రెడ్డికి మాత్రమే అర్హత ఉందని కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు చెబుతారు. అలాంటి మర్రి శశిధర్ రెడ్డికి పార్టీ టిక్కెట్టు నిరాకరించింది. మహాకూటమి పొత్తులో భాగంగా ఆ స్దానాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించింది. దీంతో మర్రి శశిధర్ రెడ్డి వర్గీయులు పార్టీ అధిష్టానంపై మండిపడుతున్నారు. తనకు టిక్కెట్టు దక్కకపోవడానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డే కారణం అంటూ శశిధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో తనకు పట్టులేదని, ఓడిపోతనంటూ అధిష్టానానికి తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆయన ఆరోపిస్తున్నారు.

నిజానికి ముందస్తు ఎన్నికలు ప్రకటించిన వెంటనే ఓటర్ల జాబితాలో తప్పులపై ఎన్నికల సంఘంతో వైరం పెట్టుకున్నది మర్రి శశిధర్ రెడ్డే. ఓటర్ జాబితాలో తప్పులను సవరించడం శశిధర్ రెడ్డి చేసిన పోరాటం వల్లే సాధ్యమైంది అని అంటున్నారు. ఈ పని చేస్తున్నంత సేపు శభాష్ అంటు మెచ్చుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు టిక్కెట్ల విషయం వచ్చేసరికి ఆయనకు మొండి చెయ్యి ఇచ్చారు. శనివారం రాత్రి విలేఖరుల సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పైనా, కాంగ్రెస్ అధిష్టానం పైన శశిధర్ రెడ్డి నిప్పులు చెరిగారు. త్వరలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తన భవిష్యత్తు కార్యచరణను ప్రకటిస్తానని మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం హడావుడిగా శశిధర్ రెడ్డిని ఢిల్లీ రావాలంటూ పిలిచారు. రెండు రోజుల క్రితం తనకు టిక్కెట్టు వచ్చేలా చూడాలంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్‌ ను శశిధర్ రెడ్డి కలిసారు. అయితే ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. శశిధర్ రెడ్డిని ఢిల్లీ రమ్మని బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ అధిష్టానం. పార్టీలో అలిగిన సీనియర్లను ఎంత మందిని ఇలా బుజ్జగిస్తారంటూ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు.