Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఏం చేసినా హోల్ సేల్ గా చేస్తారా?

By:  Tupaki Desk   |   5 Oct 2015 6:27 AM GMT
కేసీఆర్ ఏం చేసినా హోల్ సేల్ గా చేస్తారా?
X
తెలంగాణ సర్కారు మరోసారి తన మార్క్ నిర్ణయం తీసుకుంది. విపక్షాల విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు ఎలాంటి మొహమాటం లేదన్న రీతిలో మరోసారి తాజాగా వ్యవహరించారు. రైతల ఆత్మహత్యల నేపథ్యంలో రెండు రోజుల పాటు చర్చ జరగటం.. ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇచ్చిన తర్వాత విపక్షాలు తమ వాదనను వినిపించాలన్న వ్యూహాన్ని గురువారం సిద్ధం చేసుకుంటే.. ఏడంటే ఏడు నిమిషాల వ్యవధిలో సభను సోమవారానికి వాయిదా వేయటం తెలిసిందే.

సభ ప్రారంభమయ్యాక.. రైతుల రుణమాఫీకి సంబంధించి ఏకమొత్తంగా మాఫీ అంశంపై ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని కోరుతూ విపక్షాలు పట్టుబట్టటం.. సభను స్తభింపచేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు కనిపించింది. రైతుల అంశంపై ఎక్కువ రచ్చ జరిగితే ప్రభుత్వానికి ఇబ్ది అవుతుందని భావించారేమో కానీ.. తెలంగాణ సర్కారు భారీ నిర్ణయాన్ని తీసుకున్నారు. సభ జరగకుండా అడ్డుకుంటున్నారంటూ కాంగ్రెస్.. టీడీపీ.. బీజేపీ.. సీపీఎం.. సీపీఐ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. స్వతంత్ర సభ్యుడితో సహా సభలో ఉన్న మొత్తం సభ్యుల్ని (కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత జానారెడ్డి.. మజ్లిస్ నేతలు మినహా) సస్పెండ్ చేస్తూ తీవ్ర నిర్ణయం తీసుకోవటం గమనార్హం.

సస్పెన్షన్ వేటు విషయంలో పెద్దగా విస్మయం వ్యక్తం కానప్పటికీ.. ఈ సమావేశాలు ముగిసే వరకూ ఈ వేటు వర్తిస్తుందని చెప్పటం షాకింగ్ గా మారింది. విపక్షాల విషయంలో తెలంగాణ సర్కారు కఠినంగా వ్యవహరించాలన్న ధోరణితో ఉందన్న విసయం స్పష్టమైంది. నిజానికి ఇలాంటి భారీ నిర్ణయాలు కేసీఆర్ సర్కారుకు కొత్తేం కాదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 16 నెలల కాలంలో నిర్వహించిన పలు అసెంబ్లీ సమావేశాల్లో (మొదటి సమావేశాల్ని మినహాయిస్తే) విపక్షాలపై ఉక్కుపాదంతో అణిచివేసేలా నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

ఆ మధ్య తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్ని సస్పెన్షన్ చేస్తే.. అందులో సభలో లేని సభ్యుల పేర్లు ఉండటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక.. రేవంత్ రెడ్డి విషయంలోనూ ఇదే ధోరణిని కేసీఆర్ సర్కారు ప్రదర్శించింది. సభను అడ్డుకుంటున్నారన్న పేరు చెప్పి.. నాడు సబా సమవేశాలు మొత్తం సస్పెండ్ చేసిన పరిస్థితి. ఇలా చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద సస్పెన్షన్ వేటు వేసిన తీరు చూస్తే.. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు భారీగా.. హోల్ సేల్ గా ఉండటం కనిపిస్తుంది. అలాంటి కోవలోకే.. తాజాగా విపక్షాలకు సంబంధించి మజ్లిస్.. జానారెడ్డి మినహా సభలో ఉన్న సభ్యులందరిని సమావేశాలు ముగిసే వరకూ సస్పెన్షన్ వేటు వేయటం గమనార్హం.