Begin typing your search above and press return to search.

విపక్షాలపై భారీ వేటు వేసి కేసీఆర్ సర్కారు

By:  Tupaki Desk   |   5 Oct 2015 6:10 AM GMT
విపక్షాలపై భారీ వేటు వేసి కేసీఆర్ సర్కారు
X
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. రైతుల రుణమాఫీ అంశంపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విపక్ష సభ్యలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షాల నుంచి భారీ ఎత్తున వెల్లువెత్తిన నిరసనపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కస్సుమన్నారు. విపక్షాల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. విపక్షాలపై విరుచుకుపడ్డారు.

బీఏసీలో అనుకున్నట్లు రెండు రోజుల పాటు రైతు ఆత్మహత్యలపై సమగ్రంగా చర్చలు జరిపామని.. ఇక.. ఆ అంశంపై సభాముఖంగా ఏం చేస్తామన్నది చెప్పామని.. అయినా.. ఏం చేస్తారు? ఎలా చేస్తారు? లాంటి విషయాలపై పట్టుబట్టటం ఏమిటంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏం చేయాలన్న దానిపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటామని.. విపక్ష సభ్యలు సభను అడ్డుకోవటం సరికాదంటూ అసహనం వ్యక్తం చేశారు.

తాము అనుకున్నట్లు సభను సాగించకుండా.. అడ్డుపడుతున్న విపక్షాలపై టీ సర్కారు తీవ్ర నిర్ణయాన్ని తీసుకుంది. అసెంబ్లీని అడ్డుకుంటున్న విపక్ష సభ్యలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్.. టీడీపీ..బీజేపీ నేతల్లోని కొందరిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మూడు పార్టీ నేతలపై వేసిన సస్పెన్షన్ వేటు.. అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయ్యేవరకూ ఉండటం తీవ్ర నిర్ణయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.