Begin typing your search above and press return to search.

అసలు బాధ్యులది ఎప్పుడూ మౌనముద్రే!

By:  Tupaki Desk   |   18 Oct 2017 5:29 PM GMT
అసలు బాధ్యులది ఎప్పుడూ మౌనముద్రే!
X
భారతీయ జనతా పార్టీకి సంబంధించి అమిత్ షా కుమారుడు జైషా అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. అదే మాదిరిగా.. ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీ తో సోనియా అల్లుడు రాబర్ట్ వాధ్రా కు అవినీతి మయమైన సంబంధాలు ఉన్నాయని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ రెండు పార్టీలూ.. తమ తమ ప్రత్యర్థుల మీద శరపరంపరగా విమర్శలు గుప్పించడానికి వారికి రెండు మార్గాలైతే దొరికాయి. వారు ఎడాపెడా ఒకరినొకరు తిట్టేసుకుంటున్నారు. కాకపోతే.. వారి దూషణ పర్వాలను తిలకిస్తున్న ప్రజలు మాత్రమే వెర్రి వెంగళాయిలుగా తేలిపోతున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

రాజకీయంగా పెద్ద తలకాయల కుటుంబాలకు చెందిన వ్యక్తులు అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చినట్లయితే.. అది ప్రత్యర్థులు కొన్నాళ్లు నానా యాగీ చేయడానికి తప్ప.. మరెందుకూ పనికి రాని వ్యవహారంగా మారిపోతున్నది. ఏ ఒక్క అవినీతి ఆరోపణ కూడా చివరికంటూ నిలబడుతున్న సందర్భాలు మన దేశంలో చాలా తక్కువనే చెప్పాలి.

వీటన్నింటికంటె ఘోరమైన సంగతి ఏంటంటే.. ఆయా పార్టీలకు సంబంధించిన అసలు బాధ్యులైన నాయకులు మాత్రం.. తమ పార్టీలపై వస్తున్న ఆరోపణల గురించి ఎప్పుడూ నామమాత్రంగా కూడా స్పందించరు. అదే పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే మాత్రం.. పీఠం తమకే దక్కాలని ఆరాటపడే నాయకులు, అదే రీతిలో పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడు, ఆరోపణలు ముసురుతున్నప్పుడు బాద్యత తీసుకుని స్పందిస్తే వారి నాయకత్వానికి విలువ ఉంటుంది. కానీ ఇరు పార్టీల్లో కూడా ఒకటే పెడపోకడ. అసలు బాధ్యులు మాత్రం ఎప్పుడూ మౌనముద్రలోనే ఉంటారు.

ఇటు అమిత్ షా మీద , ఆయన కొడుక జయ్ షా వ్యాపారాలకు సంబంధించి ఆరోపణలు వెల్లువెత్తినంత కాలమూ ఈ విషయంలో ప్రధాని మోడీ స్పందించాలని, ఆయన కనీసం తన అభిప్రాయాలను ట్వీట్ రూపంలోనైనా చెప్పాలని రాహుల్ గాంధీ పదే పదే డిమాండ్ చేశారు. అదే మాదిరిగా ఇప్పుడు కాంగ్రెస్ కు కూడా చికాకులు తప్పడం లేదు. సంజయ్ భండారీ నుంచి రాబర్ట్ వాద్రా ముడుపులు స్వీకరించాడు అన్నట్లుగా వస్తున్న ఆరోపణలకు సంబంధించి సోనియా రాహుల్ స్పందించాలని భాజపా నాయకులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. రాహుల్ తన ట్వీట్లలో బావగారి బాగోతం ఏమిటో చెప్పాలని భాజపా నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. చూడబోతే.. అసలు నాయకుల ఎప్పుడూ స్పందించరు.. వీరి తగాదాలను చూస్తూ కూర్చున్న ప్రజలు మాత్రమే వెర్రి వెంగళాయిలని తేలిపోతుంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.