Begin typing your search above and press return to search.

ఏపీలో దిగ్గ‌జాల‌ను ఇంటికి పంపిన సామాన్యులు!

By:  Tupaki Desk   |   24 May 2019 8:28 AM GMT
ఏపీలో దిగ్గ‌జాల‌ను ఇంటికి పంపిన సామాన్యులు!
X
ఓప‌క్క దిగ్గ‌జ నేత‌లు.. మ‌రోవైపు జ‌నం క‌ష్టం తెలిసిన సామాన్య నేత‌లు. విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుందంటే..క‌చ్ఛితంగా దిగ్గ‌జ నేత‌ల వైపు మొగ్గుచూపుతారు. కానీ.. ఏపీ ప్ర‌జ‌లు అందుకు భిన్నంగా.. చాలా తెలివిగా త‌మ ఓటును వేశారు. పేరు గొప్ప అయితే స‌రిపోద‌ని.. తమ క‌ష్టాలు తెలిసిన వారికి.. త‌మ స‌మ‌స్య‌ల మీద అవ‌గాహ‌న ఉన్న వారికి మాత్ర‌మే ఓట్లు వేయాల‌ని డిసైడ్ అయ్యారు.

దీంతో దిగ్గ‌జ నేత‌లుగా పేరున్న నేత‌లంతా తాజా ఎన్నిక‌ల్లో మ‌ట్టిక‌ర‌వ‌ట‌మేకాదు.. సంచ‌ల‌న విజ‌యాలు న‌మోద‌య్యాయి. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల బ‌రిలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అత్యంత సామాన్యులు. కానీ.. వారే ఇప్పుడు ప్ర‌జాప్ర‌తినిధులుగా అవ‌త‌రించారు. అలాంటి ప‌రిస్థితి ఒక‌టి రెండుచోట్ల కాదు.. చాలా చోట్ల ఉండ‌టం విశేషం. టీడీపీ దిగ్గ‌జాల‌కు ఓట‌మి షాకిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు ఎవ‌ర‌న్న‌ది చూస్తే..

+ అనంతపురం ఎంపీగా పోటీ చేసిన తలారి రంగయ్య ఓ ప్రభుత్వోద్యోగి. డీఆర్‌డీఏలో పీడీగా పనిచేశారు. బీసీలకు పెద్దపీట వేయాలన్న వైఎస్‌ జగన్‌ ఆశయంతో ఉత్తేజితుడై ఎన్నికల్లోకొచ్చారు. టీడీపీ నేత జేసీ తనయుడు పవన్‌పై పోటీ చేసిన ఆయ‌న‌.. జేసీ కొడుకును ఓడించారు.

+ గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన నందిగం సురేష్‌ ఓ సాధారణ కార్యకర్త. టీడీపీ సిట్టింగ్‌ ఎంపీ మాల్యాద్రిని ఈ ఎన్నికల్లో ఓడించారు.

+ అరకు ఎంపీగా పోటీ చేసిన గొడ్డేటి మాధవి ఓ సాధారణ గిరిజన మహిళ. ప్రత్యర్థిగా బరిలో ఉన్న టీడీపీ అభ్య‌ర్థి కిశోర్‌ చంద్రదేవ్‌ రాజవంశీకుడు క‌మ్ మాజీ కేంద్ర‌మంత్రి. కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి. అయినా మాధవి ప్రజాభిమానం ముందు ఆయ‌న ఓట‌మిపాలు కాక త‌ప్ప‌లేదు.


+ హిందూపురం ఎంపీగా వైఎస్సార్‌సీపీ తరఫున నిలిచిన గోరంట్ల మాధవ్‌ పోలీసు ఉద్యోగి. ప్రజాసేవ ద్వారానే ఫ్యాక్షన్‌ మూలాలు పెకిలించాలని భావించిన మాధవ్‌.. హిందూపురంలో ప్రత్యర్థి నిమ్మల కిష్టప్పను మట్టి కరిపించారు.

+ చిత్తూరు పార్లమెంట్‌ స్థానం వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసిన రెడ్డప్ప సైతం ఓ సాధారణ కార్యకర్తే. ఆయన ఎన్‌ శివప్రసాద్‌పై గెలుపొందారు.

+ ఎచ్చెర్లలో సాధారణ కార్యకర్త గొర్లె కిరణ్‌ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావును ఓడించారు.

+ పలాసలో ఓ సాధారణ వైద్యుడు అప్పలరాజు అధికార పార్టీ అభ్యర్థిని చిత్తు చేశారు.

+ విజయనగరం జిల్లా ఎస్‌ కోటలో టీడీపీ కంచుకోటను రాజకీయాలకే కొత్త అయిన జ‌గ‌న్ పార్టీ అభ్యర్థి కలిదిండి శ్రీనివాస్‌ బద్దలు కొట్టారు. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి కోళ్ల అప్పలనాయుడు ఏడుసార్లు.. ఆయన కోడలు లలితకుమారి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ చరిత్రను తాజా ఎన్నిక‌ల్లో శ్రీనివాస్‌ తిరగరాశారు.

+ వైఎస్సార్‌సీపీలో సామాన్య నేతలైన పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం అభ్యర్థి ముప్పిడి వెంకట్రావ్ ది ఇదే క‌థ‌.

+ కృష్ణా జిల్లా పామర్రు అభ్యర్థి కైలే అనిల్‌కుమార్‌ ఘనమైన విజయం సాధించారు.

+ కర్నూల్‌ జిల్లా నందికొట్కూర్‌లో మాజీ పోలీసు ఉద్యోగి ఆర్థర్‌ అధికార పార్టీ అభ్య‌ర్థిని మట్టి కరిపించారు.

+ ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని అబ్బయ్య చౌదరి దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌పై గెలుపొంది సంచ‌ల‌నం సృష్టించారు.