Begin typing your search above and press return to search.

బీజేపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రచ్చరచ్చ

By:  Tupaki Desk   |   23 July 2016 7:36 AM GMT
బీజేపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రచ్చరచ్చ
X
రాజమండ్రి బిజెపిలో గ్రూపు రాజకీయాలు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ - ఎమ్మెల్సీ సోము వీర్రాజు గ్రూపుల మధ్య వైరం ముదిరి పాకానపడింది. ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఏడాది కాలంగా నగరంలో పర్యటిస్తూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. అందుకు సంబంధించిన కవరేజి పత్రికల్లో వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో స్థానికంగా సోము వీర్రాజు కంటే ఆయన నిత్యం పత్రికల్లో కనిపిస్తున్నారు. దీంతో వీర్రాజు వర్గం గుర్రు మంటోంది. పేపరులో ప్రచారానికి పాకులాడుతూ పార్టీని పట్టించుకోవడం లేదంటూ ఆకులపై ఆరోపణలు గుప్పిస్తోంది. అంతేకాదు.. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే నగర పర్యటన చేస్తున్నారని అంటోంది. అయితే.. ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో పర్యటిస్తే ఆ వివరాలు ఎమ్మెల్సీకి చెప్పాల్సిన అవసరమేంటన్న ప్రశ్న ఇక్కడ ఉదయిస్తోంది. దీంతో ఆకుల పాపులారిటీ పెరుగుతుండడంతో సోము వీర్రాజు తెగ ఫీలయిపోతున్నారని.. అందుకే ఈ వివాదాలు రేపుతున్నారని అంటున్నారు.

అయితే.. సోము వీర్రాజు గ్రూపు నుంచి అభ్యంతరాలు - విమర్శలు వస్తున్న కొద్దీ ఆకుల మరింత దూకుడు పెంచుతున్నారు. పొద్దున్న లేచి నగర పర్యటన మొదలు పెడుతున్నారు. అదంతా పత్రికల్లో కవరయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో మరునాడు పేపర్లు - లోకల్ టీవీల్లో ఆకులకు ఫుల్లు కవరేజి వస్తుండడంతో సోము వీర్రాజు వర్గానికి మతి పోతోందట. మరోవైపు వీర్రాజుతో సరిగా పొసగని మాజీ అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం సింగ్ కూడా ఆకులకు బాగా క్లోజ్ గా ఉంటున్నారు. ఇది కూడా వీర్రాజు వర్గానికి కోపం తెప్పిస్తోంది.

కాగా గతంలో బిజెపి అర్బన్‌ జిల్లా అధ్యక్ష పదవి విషయంలోనే ఎంఎల్‌ సి సోము వీర్రాజు - ఎంఎల్‌ ఎ ఆకుల సత్యనారాయణ మధ్య విభేదాలు బయటపడ్డాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానం కోసం పోటీపడుతున్న తనకు జిల్లాలో ప్రయారిటీ దక్కడం లేదని వీర్రాజు తెగ ఆందోళన చెందుతున్నారట. ఏదైనా బలమైన కారణం కనిపిస్తే ఆకులపై అధిష్టానానికి కంప్లయింటు చేయాలని వీర్రాజు సమయం కోసం కాచుక్కూచున్నారని చెబుతున్నారు.