Begin typing your search above and press return to search.

కోడి గెలిచింది

By:  Tupaki Desk   |   15 Jan 2018 6:34 PM GMT
కోడి గెలిచింది
X
ఎట్టకేలకు కోడే గెల్చింది. ఖాకీ తలొంచాల్సి వచ్చింది. భారత సర్వోన్నత న్యాయస్థానం నిలువరించమని ఆదేశాలు ఇచ్చిందంటూ బరుల్లోకి కోళ్ళు దిగక్కుండా కాపు కాసేందుకు పోలీసులు చేసిన యత్నం భగ్నమైంది. ఊహించినట్టే ప్రజాప్రతినిధులు - రాజకీయ నేతల అండదండలతో పందెంరాయుళ్ళు న్యాయస్థానం ఆదేశాలను తుంగలో తొక్కారు. రాజకీయం ముసుగులో `బరి` తెగించారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భోగి పండుగ రోజైన ఆదివారం కోడి పందేలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - మాజీ ఎమ్మెల్యేలు - ఇతర ప్రజాప్రతినిధులు పందెంరాయుళ్లకు రక్షణగా నిలిచారు. రాజకీయ నేతల సహకారంతో కోడి పందేలు జరుగుతుంటే పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు.

ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి - హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తోన్న పెద్దాపురం నియోజకవర్గంలో కోడి పందేలు సహా గుండాట వంటి ఇతర చట్టవిరుద్ధమైన జూదం పెద్ద ఎత్తున ప్రారంభమయ్యిందని మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగింది. పెద్దాపురం నియోజకవర్గంలోని వేట్లపాలెం - జి మేడపాడు గ్రామాల్లో గుండాట నిర్వహించార‌ని విస్తృత క‌థ‌నాలు వ‌చ్చాయి. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న గుండాటను మహిళలు సైతం తిలకించేందుకు పెద్ద ఎత్తున వస్తుండటం విశేషం! హోంమంత్రి ఇలాఖాలోని సామర్లకోట - పెద్దాపురం - మాథవపట్నం - అచ్చంపేట తదితర ప్రాంతాల్లో కోడి పందేలను పెద్ద ఎత్తున నిర్వహిస్తుంచార‌ని మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. కోర్టు ఆదేశాలను తుంగలోకి తొక్కి కోళ్లకు కత్తులు కట్టి మరీ నిర్భయంగా పందేలు ఆడుతున్నప్పటికీ పోలీసులు బరులవైపు దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంద‌ని అంటున్నారు. కోట్ల మొత్తంలో పందేలపై ఫణంగా పెడుతున్నట్టు తెలుస్తోంది. ముమ్మిడివరం నియోజకవర్గంలో కోడి పందేలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

సుప్రీంకోర్టు ఆదేశాలకు తిలోదకాలిస్తూ కోళ్లకు కత్తులు కట్టి పందేలు ప్రారంభించారు. భారీ ఎత్తున సిద్ధం చేసిన బరుల వద్దకు వందల సంఖ్యలో జనం చేరినప్పటికీ ఒక్క పోలీసు కూడా ఆ దిశగా దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కోడి పందేలతో పాటు గుండాట - స్కిల్‌గేమ్స్‌ను పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాల్లో నిర్వహిస్తున్నప్పటికీ ఇటు పోలీసు యంత్రాంగం - అటు రెవెన్యూ అధికారులు ప్రేక్షక పాత్ర వహించారని ప్ర‌చారం జ‌రుగుతోంది. జిల్లాలోని కోనసీమలో మురమళ్ల - ఐ పోలవరం - మెట్ట ప్రాంతంలోని తుని - కోట నందూరు - తొండంగి - కత్తిపూడి - పిఠాపురం - కాకినాడ రూరల్ - కాజులూరు - కరప - రామచంద్రపురం - మండపేట - అంబాజీపేట - రావులపాలెం - రాజానగరం - అనపర్తి - బిక్కవోలు - ద్వారపూడి - పెదపూడి - జి మామిడాడ తదితర ప్రాంతాల్లో కోడి పందేలు భారీ ఎత్తున జరుగుతున్నట్టు రెవెన్యూ - పోలీసు అధికారుల వద్ద సమచారం ఉన్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో బరులపై దాడులు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు.

కాగా - కోడి పందేలకు అనుకూలంగా వ్యవహరించాల్సిందిగా అధికార పార్టీ నేతల నుండి పోలీసులకు పరోక్షంగా ఆదేశాలందినట్టు తెలిసింది. కోడి పందేలు ఆడితే కఠిన చర్యలు తప్పవని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా - ఎస్పీ విశాల్‌గున్నీలు ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ ప్రముఖులు రంగంలోకి దిగినట్టు సమాచారం!