Begin typing your search above and press return to search.

కోబ్రా స్టింగ్ ఆప‌రేష‌న్ లో 2 తెలుగు న్యూస్ చానెళ్లు

By:  Tupaki Desk   |   26 May 2018 12:13 PM GMT
కోబ్రా స్టింగ్ ఆప‌రేష‌న్ లో 2 తెలుగు న్యూస్ చానెళ్లు
X
కొద్ది రోజుల క్రితం ప్ర‌ముఖ వార్తా సంస్థ కోబ్రా పోస్ట్ చేపట్టిన ‘క్యాష్ ఫర్ కవరేజ్’ దేశ‌వ్యాప్తంగా పెను ప్ర‌కంప‌న‌లు రేపిన సంగ‌తి తెలిసిందే. ఫోర్త్ ఎస్టేట్ గా పిలుచుకుంటోన్న మీడియా....కాసుల‌కు క‌క్కుర్తిప‌డి ఏ విధంగా పెయిడ్ వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తోందో ఆ వార్తా సంస్థ బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. తాజాగా, ఆ సంస్థ మ‌రోసారి కొన్ని చానెళ్ల బాగోతాన్ని బ‌య‌ట‌పెట్టింది. ఈ సారి దేశవ్యాప్తంగా 25 ప్ర‌ముఖ వార్తా చానెళ్లు - పేప‌ర్ల జాత‌కాలను వెల్ల‌డించింది. హిందుత్వ వార్తలను విస్తృతంగా ప్రసారం చేస్తే భారీ స్థాయిలో డబ్బు చెల్లిస్తామ‌ని కోబ్రా పోస్ట్ చేప‌ట్టిన‌ స్టింగ్ ఆపరేషన్ లో ఆ చానెళ్ల గుట్టుర‌ట్ట‌యింది. ఆ జాబితాలో ప్ర‌ముఖ తెలుగు వార్తా చానెళ్ల‌ పేర్లు ఉండ‌డం పెను ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. తాజాగా ఆ సంస్థ వెల్ల‌డించిన క‌థ‌నంలో ఈ రెండు చానెళ్ల‌తో పాటు మ‌రో 23 జాతీయ - స్థానిక చానెళ్లు - పేప‌ర్ల బాగోతాలు బ‌య‌ట‌ప‌డడం ఇపుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

కోబ్రా పోస్ట్‘క్యాష్ ఫర్ కవరేజ్’ పేరిట ఆ సంస్థ ప్ర‌తినిధి 28 మీడియా సంస్థ‌ల‌ను క‌లిశారు. అయితే, వాటిలో 3 సంస్థ‌లు మిన‌హా మిగతా 25 సంస్థ‌లు డ‌బ్బు తీసుకొని కాంగ్రెస్ వ్యతిరేకత - హిందుత్వ అనుకూల వార్తా కథనాలను ప్ర‌సారం చేయ‌డానికి అంగీక‌రించాయ‌ని స్టింగ్ ఆప‌రేష‌న్ లో వెల్ల‌డైంది. ఆ స్టింగ్ ఆప‌రేషన్ పై ఓ క‌థ‌నాన్ని ఆ సంస్థ ప్ర‌చురించింది. ఆ స్టింగ్ ఆప‌రేష‌న్ కు సంబంధించిన వీడియోలు - ఆడియో రికార్డింగ్ లు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని తెలిపింది. ఆశ్చ‌ర్య‌క‌రంగా ఆ జాబితాలో రెండు తెలుగు వార్తా చానళ్లుండ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆ త‌ర‌హా వార్త‌లు ప్ర‌సారం చేసేందుకు ఆ రెండు ఛానెళ్ల ప్రతినిధులు అంగీక‌రించిన‌ట్లు కోబ్రా పోస్టు ప్రతినిధితో స్టింగ్ ఆపరేషన్ లో వెల్ల‌డైంది. తమకు తెలుగుదేశంతో సత్సంబంధాలున్నాయని ఒక ఛానల్ ప్ర‌తినిధి ....స్టింగ్ ఆప‌రేష‌న్ లో పేర్కొన్నట్లు క‌థ‌నంలో ప్రచురించారు.

ఏపీ సీఎం చంద్రబాబుతో త‌మ చానెల్ కు స‌న్నిహిత సంబంధాలున్నాయ‌ని, ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ తమ‌ టెక్నికల్ టీం పనిచేస్తుందని - తాము ఇచ్చే ఫీడ్‌ నే ఇతర మీడియా వర్గాలు వాడుకోవాల్సి ఉంటుందని అయన వివరించిన‌ట్లు ఆ క‌థ‌నంలో ప్ర‌చురించారు. క్యాష్ ఫర్ కవరేజీకి ఆ ఛానల్ ప్ర‌తినిధి అంగీక‌రించాడ‌ని...త‌మ ప్ర‌తినిధితో ఆయన సంభాష‌ణ‌ను య‌థాత‌థంగా ఆ క‌థ‌నంలో వెల్ల‌డించింది. గతంలో తాము బీజేపీకి అనుకూలంగా పని చేసిన‌ట్లు ఇంకో ఛానల్ ప్రతినిధి వెల్లడించాడట‌. నోట్లరద్దు సమయంలో మోడీకి అనుకూలంగా క‌థ‌నాలు ప్ర‌చురించామ‌ని తెలిపాడట‌. డ‌బ్బులిస్తే....కాంగ్రెస్ ను భ్ర‌ష్టుప‌ట్టించేందుకు క‌థ‌నాలు వండివారుస్తామ‌ని ఛానల్ ప్రతినిధి చెప్పాడని కోబ్రా పోస్ట్ పేర్కొంది. ఆ సంభాష‌ణ వీడియోలను కూడా కోబ్రా పోస్ట్ విడుదల చేసింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఆ వీడియోలు వైర‌ల్ అయ్యాయి.