Begin typing your search above and press return to search.

అచ్చెన్నా....మాట‌ల‌తో ఏడిపించావ్

By:  Tupaki Desk   |   27 Aug 2015 5:55 AM GMT
అచ్చెన్నా....మాట‌ల‌తో ఏడిపించావ్
X
అచ్చెన్నాయుడు...సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త ఎర్ర‌న్నాయుడు సోద‌రుడిగానే కాకుండా రాజ‌కీయాల్లో మాట‌కారిగా పేరు సంపాదించిన నాయ‌కుడు. ప్ర‌తిదానికి దూకుడుగా స్పందించే అచ్చెన్నాయుడు... సొంత జిల్లా శ్రీకాకుళంకు చెందిన అందులో అధికారపార్టీ నేతపై మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ప్రభుత్వ పథకాలపై సమీక్షను ఏర్పాటు చేసుకుని.. చివరికి వ్యక్తిగత దూషణలతో ముగించుకునే స్థితికి చేరింది. చివరికి మంత్రిగారి వాక్చాతుర్యానికి ఎమ్మెల్యే కన్నీరు పెట్టుకున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన పౌరసరఫరాల శాఖ సమీక్షా సమావేశానికి జిల్లా ఇంచార్జ్ మంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత హాజరయ్యారు. దీంతో ఈ మీటింగ్ లో శాఖాపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయని.. అధికారులందరూ వచ్చారు. కానీ, అక్కడ సీన్ మారిపోయింది. ప్రభుత్వ పరమైన సమావేశం కాస్తా.. పొలిటికల్ సినిమాను తలపించింది. రైస్ మిల్లర్స్ ట్రాన్స్ పోర్ట్ చార్జీల పెంపు అంశంపై స్టేజ్ పైనున్న కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి, కిందున్న టీడీపీ ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీకి మధ్య మాటా మాటా పెరిగింది. అది కాస్తా వాగ్వాదంగా మారింది.

చివరికి రాజకీయాల్లో ఎవరు సీనియర్? ఎవరికి సిద్దాంతాలున్నాయి? ఎవరికి అనుభవం ఎక్కువ? ఇలా ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ పోవడంతో పరిస్థితి శృతిమించింది. తనకు ప్రిన్స్ పుల్స్ ఉన్నాయని, అనుభవం ఎక్కువని అచ్చెన్నాయుడు అంటే.. తాను ఎప్పటి నుంచో వాటిని ఫాలో అవుతున్నానని.. ఎవరికీ బెదిరే ప్రసక్తే లేదని బల్లగుద్ది చెప్పారు శివాజీ.

ఈ వాగ్వాదాన్ని చూసి.. అసలేం జరుగుతోందో తెలియక మిన్నకుండిపోయారు మిగతా సభ్యులు. జిల్లా ఇన్ చార్జ్ మంత్రి అయినా పరిటాల సునీత కూడా వారి మధ్యలో వివాదాన్ని సర్థిచెప్పలేకపోయారు. ఒక దశలో ఎమ్మెల్యే శివాజీకి కళ్లలో నీళ్లు తిరిగాయి. చివరికి విషయాన్ని సీఎం వద్దే తేల్చుకుంటానంటూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు ఎమ్మెల్యే. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా సాగిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పరమైన అంశం దారితప్పి.. జిల్లా అధికార పక్ష నేతల కోల్డ్ వార్ గురించి మాట్లాడే సీన్ తీసుకొచ్చింది.