Begin typing your search above and press return to search.

మీ ఫోన్‌ లో డేటాను కొట్టేసే ఈ యాప్ ఉందా?

By:  Tupaki Desk   |   23 Aug 2017 12:30 AM GMT
మీ ఫోన్‌ లో డేటాను కొట్టేసే ఈ యాప్ ఉందా?
X
భార‌త్‌ - చైనాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్తత‌ల నేప‌థ్యంలో ఇరు దేశాల‌కు సంబంధించిన ప్ర‌తి అంశమూ సున్నితంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు చైనా ఉత్ప‌త్తుల గురించి చ‌ర్చ‌కు రాగా..తాజాగా ఆ దేశానికి చెందిన సేవ‌లపై స్క్రీనింగ్ సాగుతోంది. స్మార్ట్‌ ఫోన్లలో యూజర్ల సమాచారం చోరీకి గురవుతుందనే నేపథ్యంలో కేంద్రం పలు మొబైల్ కంపెనీలకు ఇటీవలే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 21కి పైగా మొబైల్ తయారీ కంపెనీలకు నోటీసులు జారీ అయ్యాయి. ఫోన్లలో యూజర్ల డేటాకు ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు - డేటా హ్యాకింగ్‌ కు గురికాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు వంటి అంశాలపై వివరణ కోరుతూ కేంద్రం నోటీసులు జారీ చేసింది. అందుకు గడువు కూడా విధించింది. అయితే తాజాగా డేటా చోరీపై మరో వార్త తెలిసింది. అదేమిటంటే... చైనాకు చెందిన ఇంటర్నెట్ బ్రౌజర్ యాప్ 'యూసీ బ్రౌజర్ (UC Browser)' మన దేశంలో ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్లను వాడుతున్న యూజర్ల డేటాను తస్కరించి చైనా సర్వర్లకు పంపుతున్నట్టు తెలిసింది. ఇదే విషయంపై కేంద్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

చైనా కంపెనీ అయిన అలీబాబా గ్రూప్‌ నకు చెందినదే యూసీ బ్రౌజర్. భారత్‌లో ఈ బ్రౌజర్‌ ను వాడుతున్న యూజర్లు ఎక్కువగానే ఉన్నారు. దేశంలోని మొత్తం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్ యూజర్లలో 50 శాతానికి పైగా యూజర్లు యూసీ బ్రౌజర్ యాప్‌ ను వాడుతున్నట్టు రీసెర్చి సంస్థ స్టాట్ కౌంటర్ వెల్లడించింది. ఆ తరువాత స్థానంలో గూగుల్ క్రోమ్ ఉంది. దీన్ని 33 శాతం మంది యూజర్లు వాడుతున్నారు. ఆ తరువాత యూజర్లు ఓపెరా బ్రౌజర్ యాప్‌ ను వాడుతున్నారు. దీన్ని వాడుతున్న వారు 10 శాతం వరకు ఉన్నారు. యూసీ బ్రౌజర్‌ ను డెవలప్ చేసిన విధానంలోనే ఎన్నో లోపాలు ఉన్నాయని దాని వల్ల హ్యాకర్లు ఎవరైనా ఆ యాప్‌ ను వాడుతున్న యూజర్లకు చెందిన డివైస్ సమాచారం - ఐఎంఈఐ నంబర్ - ఫోన్ నంబర్ - మెయిల్ ఐడీ - జీపీఎస్ లొకేషన్ వంటి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని మరో రీసెర్చి సంస్థ తెలియజేస్తోంది. ఈ క్రమంలోనే ఆండ్రాయిడ్ ఫోన్లలో యూసీ బ్రౌజర్‌ ను వాడుతున్న యూజర్ల డేటా ఇప్పటికే చైనా సర్వర్లకు చేరిందని కేంద్రం అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

ముఖ్యంగా యూజర్ల ఫోన్ నంబర్లు - డివైస్ సమాచారం - జీపీఎస్ లొకేషన్ వివరాలు చైనా సర్వర్లకు చేరి ఉంటాయని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగానే నగరంలోని సెంటర్ ఫర్ డెవలప్‌ మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌ డ్ కంప్యూటింగ్ (సీడాక్) చేత యూసీ బ్రౌజర్ యాప్‌ ను క్షుణ్ణంగా స్కానింగ్ చేయిస్తున్నట్టు తెలిసింది. యూజర్ల సమాచారం ఈ యాప్ ద్వారా చోరీకి గురవుతుందా, లేదా అన్న కోణంలో యాప్‌ను సమూలంగా సీడాక్ పరిశీలిస్తుందని సమాచారం. ఇదే నిజమైతే యూసీ బ్రౌజర్ యాప్‌ ను నిషేధించే అవకాశం ఉందని తెలిసింది.