Begin typing your search above and press return to search.

ఉద్యోగుల పట్ల ఆ కంపెనీ ఎంత దారుణమైనదంటే..

By:  Tupaki Desk   |   24 July 2016 6:10 AM GMT
ఉద్యోగుల పట్ల ఆ కంపెనీ ఎంత దారుణమైనదంటే..
X
ఆపీసుల్లో పని సరిగా చేయకపోతే.. పనిష్మెంట్ మామూలే. అనుకున్న లక్ష్యాన్ని సాధించకుంటే చీవాట్లు మామూలే. కానీ.. ఇప్పుడు మేం మీకు చెప్పే కంపెనీ గురించి చదివితే షాక్ పక్కా. ఇలాంటి కంపెనీలు కూడా ఉంటాయా? అన్న సందేహం కలగక మానదు. చరిత్రలో ఎప్పుడూ ఏ కంపెనీకూడా వేయని చిత్రవిచిత్రమైన శిక్షల్ని విధిస్తుందీ కంపెనీ. ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేయని వారికి దారుణమైన శిక్షలు విధించే ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలంటే.. చైనా వెళ్లాల్సిందే.

చైనాలోని చోన్ గింగ్ అనే కంపెనీ చాలా దారుణమైనది. ఈ కంపెనీలో పని చేసే వారిని ఉద్యోగులు అనే కంటే కట్టు బానిసలు అనటం ధర్మమేమో. ఎందుకంటే.. ఈ కంపెనీలో విధించిన లక్ష్యాన్ని పూర్తి చేయని ఉద్యోగులకు ఈ మధ్యన ఒక దారుణమైన శిక్షను విధించారు. టార్గెట్ పూర్తి చేయని ఉద్యోగుల్ని వరుసగా నిలబెట్టి.. పచ్చి కాకరకాయలు చేతికి ఇచ్చి.. వాటిని తినమన్నారు. తినమన్నారు కదా అని.. ఎలా పడితే అలా తినేస్తే మళ్లీ భారీ శిక్ష తప్పదు. ఇచ్చిన కాకరకాయను.. గింజ కింద పడకుండా మొత్తంగా తినేయాల్సిందే. ఆ లెక్కలో తేడా వస్తే.. మళ్లీ మరొకటి తినాల్సిందే.

వినేందుకు నిజమా? అన్న డౌట్ వచ్చినా.. ఇది నిజమని చెబుతున్నారు. ఈ శిక్ష అవమానంగా ఫీలైన ఒక ఉద్యోగి ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టటం. .ఇదో సంచలనంగా మారింది. అయినప్పటికీ.. అక్కడి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోవటం గమనార్హం. నిజానికి చైనాలోని కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులు సరిగా పని చేయని పక్షంలో వారికి ఈ తరహా శిక్షలు విధించటం.. ఖైదీల మాదిరి చేతులకూ..కాళ్లూ కట్టేసి వీధుల్లో నడిపించటం లాంటివి చేస్తుంటారట.ఇదిలా ఉంటే.. ఉద్యోగుల్లో పని తీరును పెంచేందుకు ఈ మాత్రం శిక్షలు తప్పనిసరి అని కంపెనీలు సమర్థించుకోవటం వేరే సంగతి. ఈ మొత్తం చదివిన తర్వాత చైనాలోని ఉద్యోగుల్ని గుర్తు తెచ్చుకుంటే అయ్యో అనిపించక మానదు.