Begin typing your search above and press return to search.

పాక్, చైనా.. అదో రకం, ఇదో రకం!

By:  Tupaki Desk   |   27 Sep 2016 4:41 AM GMT
పాక్, చైనా.. అదో రకం, ఇదో రకం!
X
నీ స్నేహితుడెవరో చెప్పు... నువ్వేంటో నేను చెప్తాను అన్నట్లుగానే ఉంది పాక్, చైనాల పద్దతి. ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా అనుకోవాలో ఏమో కానీ చైనా అలా చేస్తుంటే పాక్ మాత్రం ఎందుకు చేయకుండా ఉంటుంది? పాక్ పనికిమాలిన పనులు చేస్తున్నా కూడా చైనా ఎందుకు మద్దతిస్తుంది? ఎందుకంటే.. ఇద్దరి దుర్మార్గపు ఆలోచన ఒక్కటే కాబట్టి! భారత్ భూభాగంపై వారికి కన్నుంది కాబట్టి!! కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఒక విషయం ఇదే చెబుతుంది. ప్రాంతాలు వేరు.. ఎంచుకున్న మార్గం వేరు అంతే మిగిలిందంతా సేం టూ సేం!

కశ్మీర్ లో పాక్ చేస్తున్న అల్లరి అంతా ఇంతాకాదు. పాక్ తన అనధికారిక సైన్యం (ఉగ్రవాదులు) తో చేస్తున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వాళ్ల దుర్మార్నాలు అలా ఉంటే.. పాక్ ఫ్రెండ్ చైనా బలగాలు తాజాగా అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని మారుమూల ప్రాంతంలోకి సుమారు 45 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చాయి. ఈ నెల మొదట్లోనే ఈ సంఘటన చోటుచేసుకున్నా.. కాస్త ఆలస్యంగా ఈ అతిక్రమణ వెలుగుచూసింది. ఈ అతిక్రమణ ప్రకారం... 40 మందికి పైగా చైనా సైనికులు వాస్తవాధీన రేఖను దాటి అరుణాచల్‌ ప్రదేశ్‌ లోకి చొచ్చుకొని వచ్చి.. ‘ప్లుమ్‌’ శిబిరం వద్ద తాత్కాలిక స్థావరాన్ని ఏర్పాటుచేసుకున్నారు. తద్వారా ఆ భూభాగం కూడా తమదేనని చెప్పుకునేందుకు ప్రయత్నించారు.

ఈ పనికిమాలిన పనిని భారత్ సైన్యం - ఇండో - టిబెట్‌ బోర్డర్ పోలీసుల (ఐటీబీపీ) సంయుక్త గస్తీ బృందం గుర్తించింది. ఇది భారత భూభాగమని, వెనక్కి వెళ్లిపోవాలని సూచిస్తూ బ్యానర్‌ ను ప్రదర్శించింది. అయినా కూడా తెగించేసినోడికి సిగ్గేమిటి - భయమేమిటి అన్న చందంగా చైనా దళాలు మాత్రం వెనక్కి వెళ్లలేదు సరికదా, సదరు భూభాగం తమదేనంటూ కూర్చున్నాయి. అయితే అనంతరం రెండు మూడు రోజుల తర్వాత చైనా సైనికులు వెనక్కి వెళ్లిపోయారు. చైనా అతిక్రమణపై ఇరుదేశాలు వచ్చే నెలలో సమావేశం కానున్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/