Begin typing your search above and press return to search.

ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్న చెన్నై వానలు

By:  Tupaki Desk   |   25 Nov 2015 1:24 PM GMT
ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్న చెన్నై వానలు
X
తమిళనాడుకు పెద్ద కష్టమే వచ్చింది. ప్రకృతి విసిరిన సవాలుకు తమిళ తంబీలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. సాదాసీదా ప్రజానీకమే కాదు.. ఐటీ పరిశ్రమ సైతం తాజా వర్షాలతో తడిచి ముద్దవుతోంది. వర్షం కారణంగా.. చెన్నైలోని ఐటీ పరిశ్రమకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. దేశంలోని ఐటీ పరిశ్రమలో చెన్నై కూడా కీలక స్థానం ఉంది.

ఒక్క చెన్నై మహానగరంలోనే ఐటీ కంపెనీలు దాదాపుగా 2.19 లక్షల మంది ఉన్నట్లు అంచనా. వాస్తవంగా ఈ సంఖ్య మరింత భారీగా ఉంటుందని చెబుతున్నారు. వర్షాల కారణంగా వీధుల్లో మోకాలి పైకి వచ్చేంత వర్షపు నీరు రోడ్ల మీద ఉన్న నేపథ్యంలో బయటకు వెళ్లలేని పరిస్థితి. కిందామీదా పడి ఆఫీసుకు చేరుకుందామంటే.. ఎవరు ఎప్పుడు చేరుకుంటారో తెలీటం లేదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. విద్యుత్తు.. ఇంటర్నెట్ సేవలకు విపరీతమైన సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో.. ఐటీ కంపెనీలకు దిక్కుతోచని పరిస్థితి. ఐటీ సేవలు అందించే కంపెనీలన్నీ కూడా క్లయింట్ల మీద ఆధారపడి బతికేవే. వారికి సేవలు ఒకటో.. రెండో రోజుల్లో ఇబ్బంది అయితే ఓకే. కానీ.. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో చెన్నై మహానగరం కిందామీదా పడుతున్న నేపథ్యంలో.. ఐటీ కంపెనీలు తమ క్లయింట్లకు అవసరమైన సేవల్ని అందించలేకపోతున్నాయి.

దీంతో.. ప్రముఖ కంపెనీలకు సంబంధించిన ఉన్నతస్థాయి ఉద్యోగులు.. కీలక ఉద్యోగుల్ని యుద్ధ ప్రాతిపదికన బెంగళూరుకు పంపించి పనులు చక్కబెడుతున్నారు. చెన్నైలో ఉన్న సిబ్బంది పలు నగరాలకు పంపుతూ.. అక్కడ నుంచి పని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో.. వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యే నగరంలో కుటుంబ సభ్యులు కిందామీదా పడుతుంటే.. తాము విధినిర్వహణ ఎలా చేయగలమని ఉద్యోగులు వాపోతున్నారు. మరోవైపు.. కంపెనీలేమో.. క్లయింట్లకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాయి. మొత్తంగా భారీ వర్షాలు చెన్నై ఐటీ పరిశ్రమకు చుక్కలు చూపిస్తున్నాయని చెప్పక తప్పదు. మరి.. ఈ ప్రకృతి వైపరీత్యం నుంచి తమిళ ఐటీ పరిశ్రమ ఎలా అధిగమిస్తుందో..?