Begin typing your search above and press return to search.

ప్ర‌తిప‌క్షంలో 2 నెలల్లో భారీ మార్పులు

By:  Tupaki Desk   |   28 July 2017 7:18 AM GMT
ప్ర‌తిప‌క్షంలో  2 నెలల్లో భారీ మార్పులు
X
ప్ర‌త్యేక‌ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సంతోషం కంటే ఎన్నిక‌ల్లో ఓడిపోయిన బాధ‌, ఆ త‌ర్వాత కూడా పార్టీ బ‌ల‌ప‌డ‌టం లేద‌నే ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్ర‌ధాన ప్ర‌తిపక్ష‌మైన కాంగ్రెస్ పార్టీలో తీవ్ర‌మైన క‌లవ‌రం క‌నిపిస్తోంది. అయితే గ‌డిచిన కాలం గురించి మ‌థ‌న‌ప‌డ‌టం కంటే...రానున్న ఎన్నికలకు సన్నద్ధమవడం ఉత్త‌మ‌మ‌నే భావ‌న‌తో కాంగ్రెస్‌ పార్టీ ముందుకు పోతోంది. ఈ క్ర‌మంలో ముందుగా పార్టీలో నాయకత్వ మార్పునకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకుందని స‌మాచారం. వాస్త‌వానికి గత ఏడాది కాలంగా అధ్యక్షుడి మార్పుపై వార్తలొస్తుండ‌గా..ప్రస్తుతం ఈ చర్చ తారాస్థాయికి చేరుకుంది. కొత్త అధ్యక్షుడెవరు, పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సత్తా ఉన్న నాయకుడెవరు? టీఆర్‌ ఎస్‌ పై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమవైపు తిప్పుకోవడంతోపాటు తన సొంత ఇమేజ్‌ ని జత పరిచి పార్టీని ఏకతాటిపై తీసుకురాగలిగిన నేత ఎవరు? అంటూ రకరకాల ఊహాగానాలతో పేర్లు బయటకు వచ్చాయి. అయితే అధ్యక్ష పదవిని మాత్రం బలమైన సామాజికవర్గానికి ఇస్తేనే బాగుంటుందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. మిగతా కీలకమైన పదవులు ఇతర సామాజికవర్గాలకు ఇవ్వడం ద్వారానే పార్టీ సమతూకమవుతుందని గాంధీభవన్‌ లోనూ, ఇతర సీనియర్‌ నాయకుల వ‌ద్ద‌ చర్చలు జరుగుతున్నాయి.

ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో టీపీసీసీ అధ్యక్షుడి పదవీకాలం ముగియనుంది. ఎన్నికల వరకు ఉత్తమ్‌ ను కొనసాగిస్తారా? లేదా ఆయన స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారా? అన్న చర్చలు ఊపందుకున్నాయి. ఎన్నికల రథసారధులుగా ఎవరుంటే బాగుంటుందనే దానిపై కాంగ్రెస్‌ అధిష్టానం చర్చలు సాగిస్తోంది. సామాజికవర్గాల వారీగా పరిశీలన చేస్తున్నట్టు తెలిసింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ వ‌ర్గాల సమాచారం మేరకు సీఎల్పీ నేతగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కకు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రాజగోపాల్‌ రెడ్డికి అవకాశం దక్కనున్నట్టు తెలిసింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఇద్దరిని నియమించాలన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఈ పదవులను దక్షిణ తెలంగాణ - ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు ప్రాతినిథ్యం కల్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పదవులను బీసీ - మైనార్టీ నేతలకు అవకాశం కల్పిస్తారని సమాచారం. కార్యనిర్వాహక అధ్యక్షుడి రేసులో పొన్నం ప్రభాకర్‌ - అంజన్‌ కుమార్‌ యాదవ్‌ పేర్లు ప్రముఖంగా వినిపస్తున్నాయి. మాజీ మంత్రి దానం నాగేందర్‌ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నా...చాలా కాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్‌ నగరంలో పార్టీ కార్యక్రమాలు కూడా చేయకుండా పార్టీ కార్యాలయానికి చుట్టపుచూపుగా వస్తున్నారు. పొన్నం ప్రభాకర్‌ తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ స్థాయిలో కీలక పాత్ర పోషించడం, ఉత్తర తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించడం ఆయనకు కలిసొచ్చే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.

కీలకమైన సీఎల్పీ - రాష్ట్ర అధ్యక్షుడిగా ఒకే సామాజికవర్గం ఉండడంతో పార్టీ నేతల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఈ ముద్రను తొలగించేందుకు నాయకత్వ మార్పు సమయంలో పదవుల్లో సామాజిక న్యాయం జరగాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ ను `డీ` కొట్టడంతోపాటు ఎన్నికల ఖర్చును భరించగలిగే వారికి అధ్యక్షపదవి దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి - ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఈ విషయంలో ఇప్పటికే అధిష్టానానికి హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. దీనికనుగుణంగా సోనియాగాంధీ - రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నితంగా ఉండే ఒక సీనియర్‌ మహిళా నేత పావులు కదిపినట్టు తెలిసింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, పార్టీ అంతర్గత విషయాలను ఆమె అధిష్టానికి ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని తెలిసింది. కోమటిరెడ్డి బ్రదర్స్‌ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగానే...పార్టీలో కొంత మంది సీనియర్‌ నేతలు కూడా తమకు తెలిసిన అధిష్టానం పెద్దల ద్వారా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష నేత కె జానారెడ్డి కూడా ఒక ఛాన్స్‌ అంటూ అధిష్టానం ముందు ప్రతిపాదించారు. తనకు పార్టీ అధ్యక్షపదవి ఇవ్వకపోతే పార్టీ నుంచి జారుకుంటానని అధిష్టానికి అల్టిమేటం ఇచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆయనతోపాటు కొంత మంది సీనియర్‌ నేతలు ప్రయత్నిస్తున్నారని స‌మాచారం. మ‌రోవైపు కాంగ్రెస్‌ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆ సామాజికవర్గం ప్రత్యేకంగా సమావేశమై...తమ డిమాండ్లను పార్టీ ముందుంచడమే కాకుండా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వంలో బీసీ సామాజికవర్గానికి ఒక కీలక పదవి దక్కే అవకాశాలు ఉన్నట్టు ఆ సామాజికవర్గాలు భ‌రోసాతో ఉన్నాయి. సామాజిక సమీకరణల మేళవింపుతో రాష్ట్ర నాయకత్వాన్ని ఎంపిక చేసే అవకాశం ఉందని స‌మాచారం.