Begin typing your search above and press return to search.

కేసీఆర్ క‌ళ్ల‌ద్దాల కోసం చందాలేసుకున్నారు

By:  Tupaki Desk   |   27 July 2016 5:56 AM GMT
కేసీఆర్ క‌ళ్ల‌ద్దాల కోసం చందాలేసుకున్నారు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను ఆయ‌న సొంత జిల్లా మెద‌క్‌ లో నిర్మిస్తున్న మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు అంశం తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకుపోయేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్న సీపీఎం ఈ క్ర‌మంలో త‌మ అగ్ర‌నేత‌ల‌ను రంగంలోకి దింపుతోంది. సీపీఎం పొలిట్ బ్యూరో స‌భ్యురాలు బృందా కార‌త్‌ తో హైద‌రాబాద్‌ లో ఆ పార్టీ స‌భ నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన బృందా కేసీఆర్‌ పై సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ప‌రిస్థితిని చూసేందుకు కొత్త కళ్ల‌ద్దాలు కొనుక్కోవాలంటూ సూచించారు.

బృందాకరత్‌ కేసీఆర్‌ కు చురకలంటించిన నేపథ్యంలో...సీపీఎం నిర్వ‌హించిన‌ స‌భ నుంచి ఊహించ‌ని స్పంద‌న వ‌చ్చింది. బృందా ప్ర‌క‌ట‌న‌ వెంటనే స‌భ‌కు హాజ‌రైన‌ నిర్వాసితుల్లోని మహిళలు - యువకులు - వృద్ధులు...కేసీఆర్‌ కళ్లద్దాల కొనుగోలు కోసం తాము విరాళాలనిస్తామంటూ యాభై - వంద నోట్లను తీసుకొని వేదికపైకి వచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు వారంతా ఈ డబ్బును అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాసితుల కమిటీ బాధ్యులు మాట్లాడుతూ.....నిర్వాసితులు అందజేసిన ఈ డబ్బును కేసీఆర్‌ కు మనీయార్డర్‌ లో పంపుతామని చెప్పారు.

అనంత‌రం త‌మ్మినేని వీరభ‌ద్రం ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ కేసీఆర్‌ - హరీశ్‌ రావు లాంటివారి అదిరింపులు - బెదిరింపులు సీపీఎంకు కొత్తకావని అన్నారు. మల్లన్నసాగర్‌ విషయంలో ప్రభుత్వం భయోత్పాతాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిర్వాసితులపై లాఠీచార్జీ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. 'నేను గతంలో ఎంపీగా - ఎమ్మెల్యేగా పనిచేశాను, ఇప్పుడు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. అలాంటి నేనే బాధితులను పరామర్శించేందుకు దొంగలాగా మూతికి బట్టకట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉన్నట్టా, లేనట్టా... ఇది నరహంతక నిరంకుశ ప్రభుత్వం. దొంగలేమో కుర్చీల్లో కూర్చుని తమాషా చూస్తున్నారు. ప్రజల కోసం పనిచేసే మేమేమో దొంగల్లాగా వెళ్లాల్సిన పరిస్థితి...' అని నిప్పులు చెరిగారు. నిర్వాసితుల పోరాటాన్ని టీఆర్‌ ఎస్‌ వర్సెస్‌ విపక్షాలు అనే పద్ధతుల్లో చూడటం సరికాదని కేసీఆర్‌కు హితవు పలికారు. 'కేసీఆర్‌...చట్టాన్ని చుట్టంలాగా వాడుకుంటున్నాడు - చట్టానికి పాతరేస్తున్నాడు - ఉల్లంఘిస్తున్నాడు కాబట్టే విమర్శిస్తున్నాం...' అని వ్యాఖ్యానించారు. మల్లన్నసాగర్‌ నిర్వాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రాజెక్టును కట్టి తీరతామంటూ మంత్రి హరీశ్‌ రావు బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.