Begin typing your search above and press return to search.

మత్తయ్య ఎక్కడున్నాడో అర్జంటుగా వెతకండి!

By:  Tupaki Desk   |   31 Aug 2016 6:47 AM GMT
మత్తయ్య ఎక్కడున్నాడో అర్జంటుగా వెతకండి!
X
ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఓటుకు నోటు కేసులో విచారించడానికి తెలంగాణ ఏసీబీ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ... దాన్ని ఎదుర్కోవడానికి - న్యాయవిచారణ - ఏసీబీ విచారణ ముందుకు సాగితే తమ నాయకుడికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి తెలుగుదేశం శ్రేణులు ఇప్పుడు యాక్టివేట్‌ అవుతున్నాయని, చురుగ్గా వ్యూహరచన చేస్తున్నాయని జనం అనుకుంటున్నారు. తెలంగాణ ఏసీబీ ప్రత్యేక విచారణ బృందాన్ని కార్యరంగంలోకి దించడానికంటె ముందే ఎక్కడ చేయాల్సిన సర్దుబాట్లు అక్కడ చేసేయడానికి రెడీ అవుతున్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భాగంగా ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తి జెరూసలెం మత్తయ్యను కూడా బుజ్జగించాలని తెలుగుదేశం ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

జెరూసలెం మత్తయ్య చంద్రబాబు తరఫున ఓటుకు నోటు బేరసారాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. ఇప్పుడు వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో కేసు వేసిన తర్వాత.. విచారణకు న్యాయస్థాన ఆదేశించింది. దీంతో ఏసీబీ అధికారులు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కేసుతో లింకున్న అందరినీ విచారిస్తారు. చంద్రబాబు పాత్రను నిర్ధరించే సందర్భంలో మత్తయ్య చెప్పే సాక్ష్యం కీలకం అవుతుంది. అందుకనే మత్తయ్య ఇప్పటిదాకా పోలీసు విచారణకు దొరకకుండా.. తెలుగుదేశం చాన్నాళ్లు కాపాడుతూ వచ్చింది. తీరా కేసు మరుగున పడ్డాక ఆయన్ను కూడా గాలికొదిలేసిందనేది అందరూ అనుకుంటున్న మాట.

ఈమధ్య ఢిల్లీలో మత్తయ్య చంద్రబాబు నుంచి తనకు ప్రాణహాని కూడా ఉన్నదంటూ, తనను వాడుకుని వదిలేశారని, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ రక్షణ కల్పిస్తాం అన్నవాళ్లు తనను పట్టించుకోవడం లేదని చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు. ఇప్పుడు మత్తయ్య పాత్ర మళ్లీ విచారణ పరిధిలోకి వచ్చే అవకాశం ఉన్నందున ముందు ఆయనను వెతికి పట్టుకుని, చంద్రబాబుకు అనుకూలంగా వాంగ్మూలం చెప్పించుకునే వరకు మంచిగా దువ్వుతూ ఉండాలని తెలుగుదేశం శ్రేణులకు ఆదేశాలు వెళ్లాయి. మత్తయ్యను బుజ్జగించాలని - చంద్రబాబు గురించి నెగటివ్‌ అభిప్రాయలు లేకుండా తాయిలాలతో ప్రసన్నం చేసుకోవాలని చూస్తున్నట్లుగా పుకార్లు వ్యాపిస్తున్నాయి. మరి ఈ కేసులో ఎన్ని మలుపులు ఉంటాయో - చంద్రబాబు ఎలా బయటపడతారో వేచిచూడాలి.