Begin typing your search above and press return to search.

బెజ‌వాడ మెట్రోకి గ్ర‌హణం.. ఆగిన టెండ‌ర్లు

By:  Tupaki Desk   |   25 Aug 2016 5:30 PM GMT
బెజ‌వాడ మెట్రోకి గ్ర‌హణం.. ఆగిన టెండ‌ర్లు
X
ఏపీ విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విజ‌య‌వాడ మెట్ర రైలు ప్రాజెక్టుకు బ్రేక్ ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏదో ఒక‌ర‌కంగా సాగుతోంది క‌దా అనుకుంటూ వ‌స్తున్న ఈ ప్రాజెక్టుకు ఇటీవ‌ల పూర్తిస్థాయిలో బ్రేకులు ప‌డ్డాయి. దీని నిర్మాణానికి సంబంధించిన టెండ‌ర్లు పూర్తిగా ర‌ద్ద‌య్యాయి. నిబంధ‌న‌ల ప్ర‌కారం టెండ‌ర్ల‌ను ఆరు మాసాల్లోగా నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే - బెజ‌వాడ మెట్రోకి సంబంధించిన టెండ‌ర్లు ఇటీవ‌ల ర‌ద్దు చేస్తూ.. డీఎంఆర్ సీ(ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేష‌న్‌) నిర్ణ‌యించింది.దీనికి అనేక కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌ధానంగా భూ సేకరణకు నిధులు సకాలంలో సర్దుబాటు కాకపోవటం - కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్టుకు తుది అనుమతులు రాకపోవటం - జైకా రుణం మంజూరు కాకపోవటం వంటి సమస్యలు టెండ‌ర్ల ర‌ద్దుకు దారితీసిన‌ట్టు తెలుస్తోంది.

సరిగ్గా 8 నెలల కిందట కారిడార్‌-1 (రైల్వేస్టేషన్‌ - వయా ఏలూరు రోడ్డు-నిడమానూరు వరకు) రూ.780 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు. దేశవ్యాప్తంగా 11 బడా కాంట్రాక్టు సంస్థలు టెండర్లు వేశాయి. ఈ కాంట్రాక్టు సంస్థలన్నీ విజయవాడ వచ్చి ప్రాజెక్టును పరిశీలించి - టెక్నికల్‌ బిడ్స్ దాఖ‌లు చేశాయి. అయితే, వీటిని ప‌రిశీలించి ఆమోదించ‌డంలో అనేక ఇబ్బందులు త‌లెత్తాయి. చివ‌రికి ఆయా టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేశారు. కాగా, దీనిపై డీఎంఆర్ సీ స్పందిస్తూ.. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ టెండ‌ర్ల‌ను పిలుస్తామ‌ని చెబుతోంది. అయితే, అది కూడా ఇప్ప‌ట్లో సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. అదెలా అంటే.. విజ‌య‌వాడ మెట్రో ప్రాజెక్టును త‌న భుజాల‌పై వేసుకున్న డీఎంఆర్‌ సీతో అగ్రిమెంట్‌ పై ప్రభుత్వం ఇంకా సంతకం చేయలేదు. మెట్రో ప్రాజెక్టు ప‌నుల‌ను దాదాపు ఏడాది కాలంగా డీఎంఆర్ సీ చేస్తున్నా.. ఎలాంటి ఒప్పందం చేసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

దీంతో ఇప్పుడు తిరిగి టెండ‌ర్లు పిలిచేందుకు డీఎంఆర్ సీకి అర్హ‌త ఉన్న‌ట్టుగా క‌నిపించ‌డం లేద‌ని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం ఈ సంస్థ‌తో ఒప్పందం చేసుకుని త‌ర్వాతే టెండ‌ర్లు పిలిచే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ఇక్క‌డే మ‌రో ప్ర‌శ్న కూడా ఉత్ప‌న్నం అవుతోంది. అదేంటంటే.. విజ‌య‌వాడ‌తోపాటు విశాఖ‌లోనూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మెట్రో క‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. దీంతో ఆ ప్రాజెక్టులో త‌ను నేరుగా పార్టిసిపేట్ చేయ‌కుండా పీపీపీ ప‌ద్ధ‌తిలో దానిని అప్ప‌గించేందుకు సిద్ధ‌మైంది. దీంతో రానున్న రోజుల్లో విజ‌య‌వాడ మెట్రోను కూడా పీపీపీ ప‌ద్ధ‌తిలో పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోందేమోన‌నే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.

అందువ‌ల్లే ప్ర‌స్తుత ప్రాజెక్టుకు ఎలాంటి ఎగ్రిమెంట్ చేసుకోలేద‌నే టాక్ వినిపిస్తోంది. కానీ, డీఎంఆర్‌ సీతో అతి త్వరలోనే అధికారిక అగ్రిమెంట్‌ జరుగుతుందని ఏఎంఆర్‌ సీ(అమ‌రావ‌తి మెట్రో రైల్ కార్పొరేష‌న్‌) చెబుతోంది. మ‌రి ఈ అగ్రిమెంటు కుదిరి - మ‌ళ్లీ టెండ‌ర్లు పిలిచి - అవి ఖ‌రార‌య్యి ప‌నులు ప్రారంభించే స‌రికి దాదాపు 2019 ఎన్నిక‌లు వ‌చ్చేయ‌డం ఖాయం అంటున్నారు విశ్లేష‌కులు. అయితే, సీఎం చంద్ర‌బాబు విజ‌న్ ప్ర‌కారం బెజ‌వాడ మెట్రో 2018 నాటికి పూర్తి కావాల్సి ఉంది. అయితే, ఇప్పుడున్న ప‌రిస్థితిలో అదంత వీజీ కాద‌ని తేల్చేస్తున్నారు అధికారులు.