Begin typing your search above and press return to search.

వేధించ‌డం ఇపుడు బాబు వంతు

By:  Tupaki Desk   |   27 May 2016 7:20 AM GMT
వేధించ‌డం ఇపుడు బాబు వంతు
X
తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఇద్ద‌రూ త‌మ‌ను వేధించ‌డం ప‌నిగా పెట్టుకున్నార‌ని ప్ర‌భుత్వ ఉద్యోగుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. కొత్త ప‌థ‌కాలు - రీ డిజైనింగ్‌ ల పేరుతో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉద్యోగుల‌ను ప‌రుగులెత్తిస్తుంటే...ఇపుడు ఆ వరుస‌లోకి ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు చేరిపోయార‌ని వాపోతున్నారు. జన సమాచార నిధి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సర్వేకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్న స‌మ‌యంలో ఈ వాద‌న తెర‌మీద‌కు వ‌చ్చింది.

ఓ వ్యక్తికి సంబంధించిన వివరాలు ఒకే చోట లభ్యమయ్యే విధంగా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సర్వేను చేపడుతున్నట్లు చెపుతోంది. ఆధార్‌ వివరాలకు తాజా సర్వే వివరాలను జత చేయనున్నారు. అయితే సర్వేను సకాలంలో పూర్తి చేసే బాధ్యత రెవెన్యూ శాఖకు ప్రభుత్వం అప్పగించింది. జూన్‌ 15వ తేదీ నుండి 45 రోజుల్లోనే ఈ సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం రెవెన్యూ శాఖకు నిర్ధేశించింది. కృష్ణా - గుంటూరు జిల్లాల్లోని రెవెన్యూ ఉద్యోగులకు సర్వే బాధ్యతలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. విజయవాడ నగరంలో రెవెన్యూ సేవలు పెరిగిన జనాభాకు అనుగుణంగా విస్తరించలేదు. దీంతో నూతన రేషన్‌ కార్డులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయి సర్వేను గతంలోనే సకాలంలో పూర్తి చేయలేకపోయారు. ఈ క్రమంలోనే విజయవాడ జిల్లాలోని ఇతర మండలాలకు చెందిన అధికారులకు పనులు అప్పగించి క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాల్సి వచ్చింది. గోదావరి పుష్కరాలు పూర్తయిన తరువాత ఈ సర్వే చేపట్టారు.

ఇలా గతంలో చేపట్టిన ఓటరు కార్డులకు ఆధార్‌ అనుసంధానం - రేషన్‌ దుకాణాల్లో వేలిముద్రల సేకరణే ఇంకా పూర్తి కాలేదు. పైగా రాజధాని పరిధి వచ్చే కృష్ణా - గుంటూరు జిల్లాలకు చెందిన రెవెన్యూ అధికారులు కృష్ణా పుష్కర ఘాట్ల నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతల్లో మునిగి ఉన్నారు. అగస్టు 12వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఘాట్‌ ల నిర్మాణం జరగలేదు. యాత్రికులకు పుష్కర నగర్‌ ల ఏర్పాట్లు, రవాణా రూట్‌ మ్యాప్‌ లు సమకూర్చుకోవాలి. పుష్కర ఘాట్ల నిర్మాణ పనుల పర్యవేక్షణకు విఆర్‌ ఒ స్థాయి అధికారులను నియమించారు. ఈ నేపథ్యంలో కృష్ణా పుష్కరాలు పూర్తయిన తరువాత సర్వే నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని రెవెన్యూ వర్గాలు కోరుతున్నారు. తమను వేధించేలా పనులు కల్పిస్తున్నారనే భావన రానీయవద్దని సూచిస్తున్నారు.