Begin typing your search above and press return to search.

జగన్ గెలిచినా బాబు క్రెడిట్ దక్కనీయడా?

By:  Tupaki Desk   |   18 April 2019 8:33 AM GMT
జగన్ గెలిచినా బాబు క్రెడిట్ దక్కనీయడా?
X
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో భారత్‌ ఒకటి. ఇక్కడి పాలకులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకునే పద్దతి మొదట బ్యాలెట్‌ పద్దతిలో ఉండగా సాంకేతిక పుణికిపుచ్చికొని ఈవీఎంల స్థాయికి వచ్చింది. దీంతో సర్పంచ్‌ - జడ్పీ ఎన్నికలు మినహా అన్ని ఎన్నికలను ఈవీఎంల ద్వారానే నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఈవీఎంపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. సాంకేతికాన్ని ప్రజోపయోగ్యంగా ఉపయోగించుకోవాల్సి ఉండగా ఈవీఎంను హ్యాక్‌ చేస్తున్నారన్న చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ గా మారింది.

ఈనెల 11న మొదటి విడత ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఈవీఎంలనే ఉపయోగించారు. అయితే రాష్ట్రంలోని కొన్ని స్థానాల్లో ఈవీఎంలు మొరాయించాయి. విజయవాడ లాంటి నియోజకవర్గ పరిధిలో మధ్యాహ్నం ఒంటిగంటయినా పోలింగ్‌ ప్రారంభం కాలేదు. దీంతో ఎలక్షన్‌ కమిషన్‌ పై జనం మండిపడ్డారు. ఎంతో ప్రయత్నించి ఓటింగ్‌ ప్రక్రియను ప్రారంభించిన అధికారులు మరుసటి ఉదయం వరకు పోలింగ్‌ నిర్వహించారు. దీంతో పోలింగ్‌ నిర్వహణపై ఎలక్షన్‌ కమిషన్‌ ను వేలుపెట్టి చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఒకప్పుడు శేషణ్‌ అనే ఎన్నికల ప్రధానాధికారి అన్ని పార్టీలతో సమానంగా ఉంటూ ఏ పార్టీ తప్పుచేసిన కొరడా ఝులిపించేవారు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకుల చేతిలో ఎలక్షన్‌ కమిషన్‌ పావుగా మారిందని అరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇదే విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేవనెత్తారు. ఎలక్షన్‌ నిర్వహణలో పక్షపాతాన్ని చూపించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఏపీలో ఓ పార్టీకి ఓటు వేస్తే మరో పార్టీకి పడ్డట్లు ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అప్పటికప్పుడు సారీ.. అంటూ అధికారులు ఈవీఎంలనే ఏదో చేసి సరిచేశారు. కానీ ఇలాంటి పరిస్థితి ఎన్నో చోట్ల ఎదరయ్యే ఉంటుంది..? అక్కడ ఎవరూ అడగకపోయే సరికి ఏదో ఒక పార్టీకి అనుకూలంగా మారిందా..? అనే అనుమానాలు లేవనెత్తుతున్నాయి.

టెక్నాలజీని ఎన్నో రకాలుగా హ్యాక్‌ చేయొచ్చని ఇదివరకు చాలా మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. అవన్నీ నిజం కాకపోవచ్చు. కానీ కొన్ని సంఘటనలు చూస్తే మాత్రం అనుమానాలు వస్తున్నాయి. ఈసీ కమిషన్‌ తీరును తప్పుబడుతూ టీడీప అధినేత ప్రశ్నిస్తున్నాడు. ఈసీ మాత్రం ఎలాంటి సమాధానం చెప్పడం లేదు.

ఏపీలో పోలింగ్‌ తీరుపై చంద్రబాబు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రధాన ప్రతిపక్షాలకు ఇవే అస్త్రాలుగా మారుతున్నాయి. ఇకనైనా ఈసీ ఎలాంటి సమాధానం చెప్పకపోతే ఓటుపై సామాన్యుడికి నమ్మకం పోయే ప్రమాదం ఉంది. ప్రతిపక్ష వైసీపీ గెలిచినా చంద్రబాబు ఇదే నెపాన్నిఈవీఎంలపై వేయాలని చూస్తున్నారు. ప్రజల బలాన్ని జగన్ కు దక్కకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు. జగన్ గెలుపును ఈవీఎంలపై నెట్టేందుకు నడుం బిగించారు. సామాన్యుడికి ఓటే ఆయుధం అని అవగాహన కల్పించిన ఈసీ ఇప్పుడు ఆ ఆయుధానికి బలం పోయిందనే ఆరోపణలను ఎలా ఎదుర్కొంటుదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.