Begin typing your search above and press return to search.

బాబు ఎన్నిక‌ల ట్విస్ట్‌...రైతు ఓటుకు మ‌రో గాలం

By:  Tupaki Desk   |   16 Feb 2019 1:15 PM GMT
బాబు ఎన్నిక‌ల ట్విస్ట్‌...రైతు ఓటుకు మ‌రో గాలం
X
ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో - ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు త‌న ఎన్నిక‌ల ఎత్తుగ‌డ‌ల‌కు మ‌రింత ప‌దునుపెడుతున్నారు. కీల‌క‌మైన వ‌ర్గాల ఓట్ల వేట‌ను ఆయ‌న ముమ్మ‌రం చేశారు. దీనిలో భాగంగా ప్ర‌ధాన వ‌ర్గానికి మ‌రో ఆక‌ర్ష‌ణ వ‌ల వేశారు. అన్నదాత సుఖీభవ పథకానికి ఆమోద ముద్ర వేస్తూ.. ప్రతీ రైతు కుటుంబానికి రూ. 10వేలు పెట్టుబడి నిధి కింద ఇచ్చేందుకు నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి విధివిధానాలను ఖరారు చేసిన ప్ర‌భుత్వం ఇటీవల కేంద్రం 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు 3 విడతలుగా రూ. 6వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించి నేప‌థ్యంలో.... కేంద్రం ఇస్తున్న రూ. 6వేలతో పాటు మరో రూ. 4వేలను రైతులకు అదనంగా ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించిందని తెలిపింది. అదే విధంగా కేంద్ర పథకానికి అర్హులు కాని రైతులకు రూ. 10వేలు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చెల్లించనుంది. దీనిలో కౌలు రైతులను కూడా భాగస్వాములను చేస్తూ నిర్ణయం తీసుకుంది.

అయితే, తాజాగా దీనికి మ‌రో స‌వ‌ర‌ణ చేసింది. అన్నదాత సుఖీభవ పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఐదు ఎకరాల పొలం ఉన్న ప్రతి కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయం ఇవ్వాల‌ని డిసైడ‌యింది. గతంలో కేంద్రం ఇచ్చే 6వేలకు అదనంగా నాలుగు వేలు ప్రభుత్వం ఇవ్వనుంది. కేంద్రం ఇచ్చే ఆరు వేలకు అదనంగా 10 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వమే 16వేలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేర‌కు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

కాగా, ఈ నిర్ణ‌యానికి ముందు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో 54లక్షల మంది రైతులకు మాత్రమే ఏడాదికి రూ. 6వేలు ప్రయోజనం చేకూరనుంది. దీంతో మిగిలిన 16లక్షల మంది రైతులకు మొత్తం రూ.10వేలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్ని ఎకరాలు ఉన్నా - ఎటువంటి నిబంధన లేకుండా ప్రతీ రైతు కుటుంబానికి రూ. 10వేలు చెల్లించాలని బుధవారం జరిగిన మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం సుమారు 69 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ లో సైతం రూ. 5వేల కోట్లను రైతుల సంక్షేమం నిమిత్తం ప్రత్యేక నిధులను కేటాయించింది. ఈ నెలాఖరులో రైతులకు అన్నదాత సుఖీభవ చెక్కుల పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఖరీఫ్‌ లో రుణ అర్హత ఉన్న వారందరికీ ఈ సాయం అందనుంది. ఖరీఫ్‌ పనులు మొదలైన వెంటనే రూ. 5వేల చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 54లక్షల మంది రైతులకు రూ. 1620 కోట్లను పెట్టుబడి సాయంగా అందించనుంది. అదే విధంగా కేంద్ర నిబంధనల ప్రకారం అర్హత పొందని 5ఎకరాలు పైబడిన రైతులు 16లక్షల మందికి తొలి విడతగా రూ. 5వేలు చొప్పున రూ. 750 కోట్లను ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కేంద్రం ఇస్తున్న మొత్తం రూ. 1080 కోట్లతో కలిపి రూ. 3,300కోట్ల మేర ప్రయోజనం రైతులకు చేకూరనుంది. ప్రతీ రైతు కుటుంబానికి రెండు విడతలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రయోజనం రూ. 7,620 కోట్ల మేర ఉంటుందని మంత్రివర్గం అంచనా వేసింది. తాజా, నిర్ణ‌యంతో ప‌డే ఆర్థిక భారాన్ని గ‌ణించాల్సి ఉంది.