Begin typing your search above and press return to search.

ముస్లింల‌కు గ‌మ‌నిక‌..బాబు ఇప్పుడు మారిన మ‌నిషి

By:  Tupaki Desk   |   19 March 2018 8:30 AM GMT
ముస్లింల‌కు గ‌మ‌నిక‌..బాబు ఇప్పుడు మారిన మ‌నిషి
X
త‌మ మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీతో తెగదెంపులు చేసుకోగానే టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముస్లింలను మచ్చిక చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇవాళ టీడీపీ మైనార్టీ వింగ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రం కోసం - ముస్లింల కోసం తాము కేంద్ర ప్ర‌భుత్వంపై విధాన‌ప‌ర‌మైన పోరాటం చేశామ‌న్నారు. `బీజేపీతో చేతులు కలపడం మిమ్మల్ని బాధించిందని నాకు తెలుసు. అయినా మీరు టీడీపీతోనే ఉన్నారు. ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. రాష్ర్టానికి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే బీజేపీతో చేతులు కలిపాం. నాలుగేళ్లు ఎదురుచూసినా ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో బయటకు వచ్చేశాం అని బాబు చెప్పారు.

త‌నను క‌లిసిన ముస్లిం నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఆయన త్రిపుల్ తలాక్ విషయంలో క్రిమినల్ కేసులు పెడతాం అంటూ చట్టం తీసుకురావడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని కేంద్రానికి మొట్టమొదట చెప్పింది తానేనని చంద్రబాబు అన్నారు. `ట్రిపుల్ తలాక్ బిల్లుపై మొదట స్పందించింది నేనే. వైఎస్సార్సీపీ కాదు. ముస్లింల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని తేల్చి చెప్పాను. ట్రిపుల్ తలాక్‌ ను నేరంగా పరిగణించడం సరికాదని బీజేపీ నాయకత్వానికి మీ కోసం ఆనాడే నిన‌దించా. ఆ బిల్లును వ్యతిరేకించిన మొదటి వ్యక్తిని నేను` అని బాబు ప్ర‌క‌టించారు. విభజన హామీలను అమలు చేయమని అడిగితే చులకన చేశారని చంద్రబాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వైసీపీవి లాలూచీ రాజకీయాలని విమర్శించారు. వైకాపా అండ చూసుకుని తెలుగుదేశం పార్టీని అణగదొక్కాలని మోడీ చూస్తున్నారని చంద్రబాబు అన్నారు.