Begin typing your search above and press return to search.

కోహినూర్ డైమండ్‌ పై బాబు క‌న్ను

By:  Tupaki Desk   |   28 May 2016 12:34 PM GMT
కోహినూర్ డైమండ్‌ పై బాబు క‌న్ను
X
తిరుపతిలో జరుగుతున్న మహానాడులో తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర‌మైన ఉప‌న్యాసం చేశారు. లండన్‌ మ్యూజియంలో ఉన్న కోహినూర్‌ వజ్రం మనదేనని చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వజ్రంగా పేరొందిన కోహినూర్‌ ఆంధ్రా నుంచే తరలివెళ్లిందని గుర్తు చేశారు. ఆంధ్రప్ర‌దేశ్ చ‌రిత్ర కాలం నుంచే కీర్తి ప్ర‌తిష్ట‌లు పొంది ఉన్నాయ‌ని చెప్పారు. అలాంటి కీర్తిని మ‌ళ్లీ రాజ‌ధాని నిర్మాణంతో సాధించే అవ‌కాశం వ‌చ్చింద‌ని బాబు అన్నారు.

ప్రపంచం మెచ్చే విధంగా రాజధాని నిర్మాణం చేపడతామని చంద్రబాబు చెప్పారు. అమరావతిని నిర్మించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి చైనా - జపాన్‌ - మలేషియా సంస్థలు ముందుకొస్తున్నాయని అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అతి పురాతన నగరంగా పేరొందిన అమరావతి పేరులోనే పవర్‌ ఉందని, అలాంటి పేరుతో నిర్మాణమయ్యే రాజధానిలో సకల సౌకర్యాలు కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. సినీ రంగంలోనే కాదు.. దేశ రాజకీయాల్లోనే ప్రభంజనం సృష్టించిన ఎన్టీఆర్‌ కు భారత రత్న ఇవ్వాలని చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే గొప్ప నటుడుగా పేరొందిన ఎన్టీఆర్‌ కు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న స‌రైన‌ద‌ని చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 115.5 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుచేస్తామని చంద్రబాబునాయుడు ప్రకటించారు. తెలుగు జాతి ఆత్మగౌరవ స్ఫూర్తి పేరుతో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా రాజధానిలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని కూడా ఏర్పాటుచేస్తామని తెలిపారు.

సినీ నటుడు - హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్ర‌సంగిస్తూ దేశ రాజకీయాల్లోనే చరిత్ర సృష్టించిన మహానుభావుడు స్వర్గీయ ఎన్టీఆర్‌ అని అన్నారు. మహానాడులో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన సభలో ప్రసంగించారు. తన తండ్రి ఎన్టీఆర్‌ గొప్పతనం - టీడీపీ ఆవిర్భావం - తెలుగు జాతికి చేసిన సేవ‌ల గురించి బాల‌కృష్ణ వివ‌రించారు.