Begin typing your search above and press return to search.

తెదేపా కేంద్ర మంతులు రాజీనామాలా? అంతుందా?

By:  Tupaki Desk   |   15 Feb 2018 6:10 AM GMT
తెదేపా కేంద్ర మంతులు రాజీనామాలా? అంతుందా?
X
పార్టీ సీనియర్ సహచరులతో సమావేశంలో చంద్రబాబునాయుడు చెప్పిన ఒక్క మాటను పట్టుకుని ఇప్పుడు తెలుగు రాజకీయ వర్గాల్లో బీభత్సమైన ఊహాగానాలు నడుస్తున్నాయి. తెలుగుదేశానికి చెందిన కేంద్రమంత్రులు సుజనాచౌదరి, అశోక్ గజపతి రాజు ఇద్దరూ తమ తమ మంత్రి పదవులకు రాజీనామా చేసేస్తారనే ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు సమావేశాలు తిరిగి మొదలయ్యే రోజున- అంటే మార్చి 5వ తేదీనే వీరి రాజీనామాలు ఉంటాయని పుకార్లు పుడుతున్నాయి. కేంద్రప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు తెదేపా అధినేత ఈ తీవ్రమైన నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. పైగా బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకహోదా కోసం పోరాడి, ఫలితం రాకుంటే.. ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలందరూ రాజీనామా చేసేయబోతున్నారని ఇప్పటికే నిర్ణయం వెలువడిన నేపథ్యంలో తాముకూడా.. ప్రజల ఎదుట పరువు కాపాడుకోవాలంటే, ఏదో ఒక దశలో రాజీనామీలు మినహా మధ్యే మార్గం లేదని తెదేపా అధినేత భావిస్తున్నట్లు సమాచారం. ఎంపీలతో కూడా రాజీనామా చేయిస్తే.. పార్లమెంటులో ఏపీ గళం వినిపించే వారు, భాజపా కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే వారే ఉండరని, దానికి బదులుగా పార్లమెంటు మొదలయ్యే సమయానికే కేంద్రమంత్రులతో రాజీనామా చేయించడం బాగుంటుందని యోచిస్తున్నట్లుగా వినిపిస్తోంది.

ఊహాగానాలు ఈ రకంగా సాగుతున్నాయి గానీ.. కేంద్ర మంత్రి పదవులను వదులుకోడానికి తెదేపా అధినేత సుముఖంగానే ఉన్నారా అనే సంగతి మాత్రం ఇప్పటికీ ప్రజలకు సందేహంగానే ఉంది. బుధవారం సమావేశంలో.. తమ కేంద్రమంత్రులు నిర్వహిస్తున్న శాఖలు రాష్ట్రానికి పెద్దగా వందల కోట్ల నిధులు తెచ్చిపెట్టేవేమీ కాదని.. అవి ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని మాత్రం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ మాట పట్టుకుని.. ఏకంగా ఆయన రాజీనామాలకు సిద్ధపడిపోయారన్న ప్రచారం జరుగుతోంది.

ఆ పదవులు ఉన్నా లేకున్నా ఒకటే అని చంద్రబాబే అంటున్నారు. మరి అలాంటి పదవుల్ని వదిలేస్తే మాత్రం జనంలో సానుభూతి ఎలా వస్తుంది? కేంద్రంపై ఒత్తిడి ఎలా పెరుగుతుంది? అనేది ప్రశ్న. నిజానికి శివసేన లాంటి అతిపెద్ద మిత్రపక్షం పోతేనే వారు ఖాతరు చేయలేదు.. ఇక తెదేపా మొత్తం ఎన్డీయే నుంచి బయటకు వెళ్లినాకూడా పట్టించుకోరు అని, ఒత్తిడి ఫీలయ్యేది ఉండదని కొందరు అంచనా వేస్తున్నారు. అందుకే చంద్రబాబు ఉన్నంతలో తమ ప్రయోజనాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా మాట్లాడుతున్నారని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.